విజయవాడ సిద్ధార్థ, కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీల్లో: కరోనా తీవ్రత..హుటాహుటిన టెస్టింగ్ ల్యాబ్స్!
అమరావతి: ప్రాణాంతక కరోనా వైరస్ విస్తృతమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పరీక్షా ల్యాబొరేటరీలను బలోపేతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రయోగ శాలలు, ల్యాబొరేటరీల స్థాయిని పెంచింది. దీనికి అదనంగా మరి కొన్ని కొత్త ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అన్ని రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నందున దానికి సంబంధించిన పరీక్షలను వేగవంతం చేయడానికి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
జనతా కర్ఫ్యూ ఐడియా వెనుక ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి: ప.గో జిల్లా కలెక్టర్గా..కొల్లేటి ఆపద్బాంధవుడిగా
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పర్యవేక్షణలో ఈ ల్యాబొరేటరీలు పని చేస్తున్నాయి. ఇదివరకే అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల, తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఙాన సంస్థ, విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీల్లో వాటిని ఏర్పాటు చేయగా.. కొత్తగా మరిన్ని లాబ్స్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం. విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాల, కాకినాడలోని రంగారాయ మెడికల్ కళాశాల, గుంటూరు మెడికల్ కాలేజీల్లో వాటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఏపీలో ఇప్పటిదాకా ఆరు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అవి కూడా విదేశాల నుంచి వచ్చిన విద్యార్థలే ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. ఇటలీ నుంచి వచ్చిన నెల్లూరుకు చేరుకున్న విద్యార్థి..కరోనా వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకున్నాడని డాక్టర్లు చెబుతున్నారు. కాగా- విజయవాడ, తూర్పు గోదావరి, విశాఖపట్నంలల్లో కొత్తగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఆయా జిల్లాలకు ఈ టెస్టింగ్ ల్యాబ్స్ను మంజూరు చేసిందని అంటున్నారు.
ఇదిలావుండగా.. రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రతను నియంత్రించడానికి జగన్ సర్కార్ పలు కఠిన నిర్ణయాలను తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. తొలుత మూడు జిల్లాలే అని భావించినప్పటికీ.. మిగిలిన జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్డౌన్ను రాష్ట్రం మొత్తానికీ విస్తరింపజేసింది. ఆదివారం నాటి జనతా కర్ఫ్యూ పరిస్థితులే ఈ నెలాఖరు వరకు రాష్ట్రవ్యాప్తంగా కనిపించబోతున్నాయి.