24 గంటల్లో వలస కూలీలను గుర్తించండి: ఏపీ సర్కార్ కు హైకోర్టు ఆదేశం
లాక్డౌన్ నేపథ్యంలో వలస కార్మికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు . వలస కార్మికులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా అసలు ప్రతి రాష్ట్రంలో ఎంత మంది వలస కార్మికులు వున్నారో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లెక్క తెలియదు . ఇక ఈ నేపధ్యంలో వలస కూలీల ఆకలి చావులు సంభవిస్తున్నాయి. దీంతో వలస కూలీలు కష్టాలు పడుతున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
అత్యవసర కేసుగా పరిగణించి విచారణ జరిపిన హైకోర్టు
అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వలస కూలీలకు 24 గంటల్లో మౌలిక వసతులు కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.అంతే కాక ఇప్పటికే లాక్డౌన్తో స్వస్థలాలకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతూ గుంటూరులో ఇద్దరు, గుజరాత్లో ఒకరు చనిపోయిన విషయం పేర్కొనటంతో ఆకలి చావులు ఉండకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. వలస కూలీలను 24 గంటల్లో గుర్తించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
24 గంటల్లో వలస కూలీలను గుర్తించాలని ఆదేశం
ఇక ఏపీకి చెందిన వలస కూలీలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయారు.. శ్రీకాకుళానికి చెందిన మత్స్యకారులు గుజరాత్లో చిక్కుకున్నారు. నిన్న గుజరాత్లోనే ఓ మత్స్యకారుడు ప్రాణాలు వదిలాడు. వలస కూలీలు మృతిచెందడంతో అత్యవసర కేసుగా పరిగణించిన ధర్మాసనం విచారణ చేపట్టి 24 గంటల్లో వలస కూలీలను గుర్తించాలని ఆదేశించటమే కాకుండా 24 గంటల్లోగా వలస కూలీలకు మెడిసిన్, ఆహారం, షెల్టర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
Recommended Video
అరిగోస పడుతున్న వలస కూలీలు .. కోర్టులు ఆదేశించినా సరే మారని బతుకులు
లాక్డౌన్ వల్ల వలస కూలీలు వేల కిలోమీటర్లు నడిచిపోతున్నారు.తమ వారి కోసం ప్రయాణాలు సాగిస్తూ అరిగోస పడుతున్నారు. కొందరు వలస కూలీలు ఆకలి తాళలేక చనిపోతున్న పరిస్థితులు నిజంగా ఆవేదనా భరితం . ఇప్పటికైనా కోర్టు ఆదేశాలతో అయినా వలస కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మంది ఉన్నారు అన్న జాబితా తయారు చెయ్యాల్సిన అవసరం వుంది. వారికి వసతులు కల్పించటంమాత్రమే కాదు ఒకవేళ అవసరం అనుకుంటే వారిని సురక్షితంగా తమ వారి దగ్గరకు చేర్చేలా కూడా ఆలోచన చెయ్యాల్సిన అవసరం ఉంది . ఇప్పటికే లాక్ డౌన్ మొదలైన నాటి నుండి సుప్రీం ధర్మాసనం కూడా వలస కూలీల విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వారికి అన్ని వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని పేర్కొంది .