అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత, వైద్యులు, పోలీసుల తీరుపై రామ్మోహన్ ఫైర్..
మాజీమంత్రి అచ్చెన్నాయుడికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు టీడీపీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్. అచ్చెన్నాయుడిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మండిపడ్డారు. అతనిని ఆస్పత్రి నుంచి బలవంతంగా డిశ్చార్జ్ చేయడం సరికాదన్నారు. అంతకు ముందురోజు కడుపులో మంటతో అచ్చెన్నాయుడు బాధపడుతున్నారని లేఖ రాశారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో ఆరోగ్యం నిలకడగా ఉంది అని డిశ్చార్జ్ చేశారని తెలిపారు.
వైద్యులు తమ ప్రొఫెషన్ మేరకు కాకుండా.. ఒత్తిడికి తలొగ్గి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో కొందరు వైద్యులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. వారి వైఖరిని ఖండిస్తున్నామని అంగర రామ్మోహన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో డిప్యూటీ ప్లోర్ లీడర్ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటీ అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అచ్చెన్నాయుడు ప్రాణానికి ఏం జరిగినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి టెలీ హెల్త్ సర్వీస్కు గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. దీంతో రూ.150 కోట్ల కుంభకోణం జరిగిందని ఏసీబీ చెబుతోంది. అప్పటి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడి ప్రమేయంతోనే కుంభకోణం జరిగిందని, అభియోగం మోపింది. ఇటీవల అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. అనారోగ్యం వల్ల జీజీహెచ్లో చికిత్స తీసుకొని.. డిశ్చార్జ్ అయ్యారు. అతని ఆరోగ్యం బాగోలేకున్నా బలవంతంగా డిశ్చార్జ్ చేశారని చంద్రబాబు సహా టీడీపీ నేతలు మండిపడుతున్నారు.