రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా...రాజకీయ సన్యాసం తీసుకుంటా: మంత్రి జవహర్ సవాల్
గుంటూరు:రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటు గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి జవహార్ సవాల్ విసిరారు. కన్నా లక్ష్మీనారాయణకు దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని ఛాలెంజ్ చేశారు.
గుంటూరు పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ ముగ్గురూ కలిసి రాష్ట్రంపై విషం చిమ్మడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ, జనసేన బీజేపీ జెండాని జేబులో పెట్టుకొని పనిచేస్తున్నాయిని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదంటూ ప్రతి పక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను మంత్రి జవహర్ ఈ సందర్భంగా ఖండించారు. విపక్ష నాయకులు తనతో వస్తే.. తన సొంత డబ్బులతో రాష్ట్రం మొత్తం తిప్పి...జరిగిన అభివృద్ధిని చూపిస్తానన్నారు. దమ్ముంటే రాష్ట్రాభివృద్ధిపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వంపై తన అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు.
పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై గాలి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. బీజేపీపై నోరు ఎత్తడానికి ప్రతిపక్ష నేత జగన్, పవన్కు దమ్ములేదని మంత్రి జవహర్ ఎద్దేవాచేశారు. చిరంజీవి తన పార్టీని హోల్ సేల్గా కాంగ్రెస్కు అమ్మితే.. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ తన పార్టీని బీజేపీకి రిటైల్గా అమ్ముతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు.
జగన్ పాప పరిహార యాత్ర 3వేల కిలోమీటర్లు దాటిందని, అయితే 30 వేల కిలోమీటర్లు పొర్లుదండాలు చేసినా జగన్ పాపం పోదన్నారు. రాష్ట్రంలో దళితుల ఎదుగుదలను జగన్ ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి జవహర్ విమర్శించారు. అమరావతిని అడ్డుకోవడమే వైసీపీ ఎజెండా అని మంత్రి జవహర్ బాబు ఆరోపించారు.