బానిసలం కాదు: కేంద్రంపై చంద్రబాబు నిప్పులు, అలా చేస్తే స్టీల్ ప్లాంట్ మేమే నిర్మించుకుంటాం’
అమరావతి: కడప ఉక్కు పరిశ్రమ విషక్ష్ంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విభజన హామీలు సాధించుకొనేందుకు కేంద్రంపై రాజీలేని పోరాటం చేస్తున్నామని చెప్పారు.
Recommended Video
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు నీళ్లు, రైల్వేలైన్, ముడి వనరులు.. అన్నీ ఉన్నాయని చెప్పారు. అయినా కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు.
బానిసలం కాదు
సోమవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో నిర్వహించిన హోంగార్డుల ఆత్మీయ అభినందన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కేంద్రానికి బానిసలం కాదన్నారు. విభజన హామీలు సాధించేదాకా కేంద్రాన్నివదిలే సమస్యేలేదని తేల్చి చెప్పారు.
పోరాటాలు చేస్తూనే..
ఓ వైపు హక్కుల సాధనకోసం పోరాటం చేస్తూనే.. మరో వైపు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. పోరాటాలకు ప్రజలంతా సన్నద్ధం కావాలని కోరారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు.
కేంద్రం చిన్నచూపంటూ..
కడపలో ఉక్కు పరిశ్రమకు కావాల్సిన వసతులన్నీ సమకూరుస్తామని చెబుతున్నా మనల్ని చిన్నచూపు చూస్తున్నారని కేంద్రంపై చంద్రబాబు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కడుతున్న పన్నులు తమకు ఇస్తే తామే ఉక్కు పరిశ్రమపెట్టుకుంటామని చంద్రబాబు స్పష్టంచేశారు.
అలా చేస్తే మేమే ఉక్కు పరిశ్రమ నిర్మించుకుంటాం
రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులను ప్రోత్సాహకాలుగా పది లేదా పదిహేనేళ్లు పాటు ఏపీకి ఇస్తే ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకుంటుందని కేంద్రానికి చంద్రబాబు స్పష్టంచేశారు. నిధులు లేకపోయినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం తమదని చంద్రబాబు తెలిపారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు.