చంద్రబాబు సీఎంగా ఉంటే...ఎప్పుడూ అప్పులే:ఉండవల్లి;ఆయన మానసిక స్థితి బాగోలేదు:కెవిపి
రాజమండ్రి:రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రులైన వైఎస్, రోశయ్య, కిరణ్ హయాంలో ఏనాడూ ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లలేదని ఉండవల్లి అరుణ్ కుమార్ గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉంటే ఎప్పుడూ అప్పులేనని ఉండవల్లి దుయ్యబట్టారు. అమరావతి బాండ్లపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావడంలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు. మరోవైపు చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదంటూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు ఉండవల్లి రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ అమరావతి బాండ్లపై తాను చేసిన విమర్శలపై ప్రతిస్పందించిన కుటుంబరావు తనకు స్టాక్ ఎక్సేంజ్ గురించి తెలియదన్నట్లుగా మాట్లాడారన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే నాకు బాండు,బాండు గ్యారెంటీ, బాంబే స్టాక్ ఎక్సేంజ్ గురించి తెలీదని అంటున్నారని, అందుకోసమే రాజమండ్రిలో ఆయా విషయాలు తెలుసుకునేందుకు ఒక స్టాక్ బ్రోకర్ దగ్గరకు వెళ్లానన్నారు. తీరా అక్కడకు వెళ్లాక తెలిసిన విషయాలు తనను నివ్వెరపరిచాయని చెప్పుకొచ్చారు.
అమరావతి బాండ్లు కొనడానికి సాధారణ ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను, అందులో అంతర్లీనంగా ఉన్న లోపాలను ఉండవల్లి ఈ సందర్భంగా వివరించారు. అమరావతి బాండ్లు అందరూ కొనడానికి లేదని, డిమాట్ అకౌంట్ ఉన్నవారే కొనాలని, అది కూడా ఒక్కో కూపన్ 2 లక్షలని, అలాగని ఒక్క కూపన్ కొనుగోలు చేయడానికి లేదన్నారు. కనీసం రూ.10 లక్షలకు బాండ్లు కొనుగోలు చెయ్యాలన్నారు.
పోనీ అలాగైనా కొందామంటే ఇప్పుడు వాటిని 11 లక్షలకు కొనాలంటున్నారు...తొలిగా కొన్నవారు 10 లక్షలు వెచ్చిస్తే వారికి ఎల్లప్పుడూ లాభమే తప్ప నష్టం ఉండదని, కానీ ఈ బాండ్లు కొనుగోలు చేసిన వారికి మాత్రం వచ్చేది పది లక్షలు, ప్లస్ వడ్డీ మాత్రమేనని...అంటే తొలిగా కొనుక్కున్న వారికే 200 కోట్ల లాభమని, కొన్నవారికి మిగిలేది వడ్డీయేనని...ఇదేం చోద్యమన్నారు. ఇవన్నీ చూస్తుంటే సిఆర్డిఎ పేరు క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ అని కాకుండాక్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ కంపెనీ అని పెట్టుకోవాల్సిందని ఉండవల్లి ఘాటుగా విమర్శించారు.
ఇదిలావుంటే మరోవైపు కాంగ్రెస్ ఎంపి కెవిపి శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. చంద్రబాబు పోలవరం గ్యాలరీలో నడిచి...ప్రాజెక్టునే జాతికి అంకితం చేసినట్టు చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వేలో గ్యాలరీ నిర్మాణం ఒక భాగం మాత్రమే అని ఆయన అన్నారు. 2019లో రాహుల్గాంధీ ప్రధాని హోదాలో వచ్చి పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తారని కేవీపీ జోస్యం చెప్పారు.