ఏపీ సీఎంగా చంద్రబాబు ఉండివుంటే.. దేశమంతా ఆ డప్పుల మోతే: విజయసాయి సెటైర్లు
అమరావతి: కరోనావైరస్ కట్టడిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కారు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోపాటు ఆ పార్టీ నేతలు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలకు ఘాటుగానే జవాబిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
ఆ పనీ చేయొచ్చుగా చంద్రబాబూ..
‘హైదరాబాద్లో ఉంటున్నావు. పోలీసు పాస్ తీసుకుని అక్కడి పేద ప్రజలకు ఏదైనా సాయం చేయొచ్చుగదా చంద్రబాబూ! ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీల నేతలు నిత్యావసరాలు పంపిణీ చేసి పేదలకు అండగా నిలుస్తున్నారు. అక్కడ ఆశ్రయం పొందుతున్నందుకైనా కొంత బాధ్యత తీసుకోవాలి గదా!' అంటూ విజయసాయి రెడ్డి చురకలంటించారు.
ఎక్కడా ఇలాంటి వింతలు కనిపించవు..
‘పనీపాట లేకపోవడమో, మీడియాలో కనిపించాలనే ప్రచారం పిచ్చి వల్లనో...లాక్ డౌన్ సమయంలో పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ జరపడం చంద్రబాబుకే చెల్లింది. మీరు వాళ్లకు ఏం టాస్క్ ఇచ్చారు? ఈ సమయంలో వాళ్లు ఏం చేయగలరో ఆలోచించారా? దేశంలో ఎక్కడా ఇటువంటి వింతలు కనిపించవు' అంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Recommended Video
సీఎంగా చంద్రబాబు వుండిఉంటే.. డప్పుకొట్టుకుంటూ..
‘చంద్రబాబు ఏపని చేసినా నిజాయితీ ఉండదు. కర్మ కాలి ఇప్పుడు సిఎంగా ఉండుంటే కరోనా కేసులను వేలల్లో చూపించి, ప్రాణనష్టం లేకుండా చేశా అని దేశమంతా డప్పుకొట్టుకుని తిరిగేవాడు. పాజిటివ్ రోగులను దాచాల్సిన అవసరం ప్రభుత్వ యంత్రాంగానికి ఏం అవసరం? మనవడితో ఆడుకోక మధ్యలో ఈ చిటికెలెందుకు?' అంటూ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. కాగా, ఇటీవల చంద్రబాబు వైసీపీ సర్కారును లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులను దాస్తున్నారంటూ ఆరోపించారు. అంతేగాక, రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలమైందని, పేద ప్రజలను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.