2019లో ఎవరికి షాకిస్తారు: జగన్ను నిన్న పవన్ కళ్యాణ్ దెబ్బకొడితే నేడు వీరు కొడతారా!?
Recommended Video
అమరావతి: విభజన నేపథ్యంలో ఏపీలో పూర్తిగా ప్రాతినిథ్యం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీలో మళ్లీ పుంజుకుంటామనే ఆశలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయం ప్రకారం.. విభజన హామీల్లో టీడీపీ, బీజేపీలు విఫలం కావడం, ప్రతిపక్షంగా వైసీపీ విఫలం కావడం... తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పడం ఉపకరిస్తుందని అనుకుంటోంది.
'పవన్తో పొత్తుపై మాట్లాడాకే చెప్తున్నాం': పురంధేశ్వరిని ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికే.. టీడీపీ
దీనికి తోడు పాత కాపులను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదటి రాయి ఫలప్రదం అయ్యేలా కనిపిస్తోంది. అదే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. మంగళవారం కాంగ్రెస్ సీనియర్ నేతలు పళ్లంరాజు, ఆ తర్వాత బుధవారం మరో సీనియర్ నేత టీఎస్సార్ మాజీ సీఎంను కలిశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు దాదాపు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.
కిరణ్ రెడ్డితో పాటు వీరివైపు కాంగ్రెస్ చూపు
కిరణ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆయనకు జాతీయస్థాయిలో ఓ పదవి ఇచ్చే అవకాశాలున్నాయని, ఈ మేరకు పార్టీ అధిష్టానం నుంచి ఆఫర్ కూడా వచ్చిందని అంటున్నారు. కిరణ్ రెడ్డితో పాటు హర్షకుమార్, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి మాజీ ఎంపీల వైపు కూడా కాంగ్రెస్ చూస్తోంది.
తటస్థంగా ఉన్న వారు కాకుండా.. ఇతర పార్టీలలో చేరిన వారు ఉన్నారు
కిరణ్ రెడ్డి, హర్ష కుమార్, ఉండవల్లి వంటి వారు ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు. ఇతర పార్టీలలో చేరిన ధర్మాన ప్రసాద రావు, గల్లా అరుణ కుమారి, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి వంటి నేతలు కూడా ఉన్నారు. ఇలా ఇతర పార్టీలలో చేరిన వారిపై కూడా కాంగ్రెస్ దృష్టి సారిస్తుందా లేదా తెలియాల్సి ఉంది. ఈ విషయం పక్కన పెడితే వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎవరికి నష్టమనే చర్చ సాగుతోంది.
వైసీపీ పైనే ఆ ప్రభావం పడుతుందా?
పాత కాపులు కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ ప్రభావం ఎంతోకొంత వైసీపీ పైనే పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం జగన్ పార్టీతో ఉన్నట్లుగా భావిస్తున్నారు. కిరణ్ రెడ్డి వంటి నేతల చేరికతో ఆ సామాజిక వర్గం మళ్లీ కాంగ్రెస్ వైపు ఏ మేరకు మరలుతుందనే చర్చ సాగుతోంది. జేసీ దివాకర్ రెడ్డి టీడీపీలో చేరారు. ఆ సామాజిక వర్గం వైసీపీ వెంట ఉంది. ఈ లెక్కల మధ్య మళ్లీ ఆ వర్గాన్ని కాంగ్రెస్ సొమ్ము చేసుకుంటుందా అనేది ప్రశ్నే అంటున్నారు.
ఆ వర్గాలు ఇప్పుడు వైసీపీ వైపు
గతంలో తమ వెంట ఉన్న ఇతర సామాజిక వర్గాలను కూడా దరి చేర్చుకోవాలని భావిస్తున్నాయి. ఇందులో భాగంగా హర్షకుమార్ వంటి నేతల వైపు చూస్తున్నాయని అంటున్నారు. ఆ సామాజిక వర్గాలు ప్రస్తుతం వైసీపీ వైపు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఆ వర్గాలు కాంగ్రెస్కు ఏ మేరకు అండగా నిలబడతాయో కానీ.. అలా నిలబడితే కనుక జగన్కు దెబ్బపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఉండవల్లి వంటి తటస్థ నేతలు జగన్ పట్ల కొంత సానుకూలంగా ఉన్నారు. అలాంటి నేతలు కాంగ్రెస్ చేరితే వైసీపీ పైనే ప్రభావం ఎక్కువగా పడుతుందని అంటున్నారు.
ప్రభావం ఉండదనే వాదన
2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయామని వైసీపీ చెబుతోంది. నాడు టీడీపీకీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతో పాటు ఎంతోకొంత నరేంద్ర మోడీ హవా ఉపయోగపడిందని అంటున్నారు. ఇప్పుడు ఆ ఇద్దరు టీడీపీకి దూరమయ్యారు. అది వైసీపీకి ఊరటనిచ్చే అంశమే. కానీ కాంగ్రెస్ పార్టీ పాత నేతలను తమ దరి చేర్చుకుంటే.. నిన్న పవన్ దెబ్బతీస్తే, రేపు వారు దెబ్బతీస్తారా.. అనే చర్చ సాగుతోంది. అయితే, కిరణ్ రెడ్డి వంటి నేతలు సొంత నియోజకవర్గంలోనే సోదరుడిని గెలిపించుకోలేకపోయారని, కాబట్టి వారి ప్రభావం ఉంటుందని భావించలేమని కూడా అంటున్నారు.