విభజన జరిగితే గుడ్బై: టిజి, రాష్ట్రపతితో భేటీ: శైలజా
కర్నూలు/ శ్రీకాకుళం/ హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే తాను కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ ప్రకటించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 3వ తేదీన సీమాంధ్ర శాసనసభ్యులతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రపతిని కలిసి బిల్లు తిప్పి పంపిన తీరును వివరిస్తామని ఆయన కర్నూలులో చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి గండికొట్టే విధంగా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు వ్యవహరిస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఆయన అన్నారు. పార్లమెంటులో బిల్లును అడ్డుకోకపోతే సీమాంధ్ర కేంద్ర మంత్రులను, పార్లమెంటు సభ్యులను చరిత్ర క్షమించదని ఆయన అన్నారు.
తెలంగాణ బిల్లును రాష్ట్రపతి న్యాయసమీక్ష కోసం పంపిస్తారని ఆశిస్తున్నామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సరైన పాత్ర పోషించలేదని, ఆయన వ్యాపారిలా వ్యవహరించారని ఆయన శ్రీకాకుళంలో మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా విఫలమైందని ఆయన విమర్శించారు. తాను ఏ పార్టీలో చేరేది ఈ నెల 9వ తేదీన చెబుతానని ఆయన అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీలను కలుపుకుని తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతిని కలుసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన సీమాంధ్ర మంత్రులు, శానససభ్యుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బిల్లును శాసనసభ తిరస్కరించడం చిన్న విషయం కాదని, ఇది కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై ప్రభావం చూపుతుందని సమావేశానంతరం మంత్రి శైలజానాథ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్రపతిని కలవడానికి కలసి రావాల్సిందిగా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కలుస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రపతిని కలిసిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంపై న్యాయనిపుణులతో చర్చిస్తామని మరో మంత్రి సి. రామచంద్రయ్య అన్నారు.
బిల్లును పార్లమెంటుకు పంపించివద్దని తాము రాష్ట్రపతిని కోరుతామని చెప్పారు. ఈ నెల 4,5 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు ఆయన తెలిపారు. ఇతర పార్టీలు కూడా తమతో కలిసి రావాలని ఆయన కోరారు. రాష్ట్రపతి ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తారని అనుకుంటున్నామని ఆయన అన్నారు.