లగడపాటి సంస్థ సర్వే!: ఎన్నికలొస్తే టీడీపీదే గెలుపు, పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంత అంటే?
అమరావతి: ఏపీలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీదే గెలుస్తుందట. ఆంధ్రజ్యోతి కోసం మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తరఫున సర్వేలు నిర్వహించే ఆర్జీస్ ఫ్లాష్ టీం సర్వే నిర్వహించిందని చెబుతున్నారు. ఈ సర్వేలో టీడీపీదే గెలుపు అని తేలిందని చెబుతున్నారు. ఎన్నికలు వస్తే టీడీపీ 110, వైయస్సార్ కాంగ్రెస్ 60, ఇతరులు 5 స్థానాల్లో గెలుస్తారని ఈ సర్వేలో తేలిందని అంటున్నారు.
సర్వే ప్రకారం.. టీడీపీ, వైసీపీల మధ్య ఓట్ల వ్యత్యాసం 7 శాతంగా ఉండనుంది. వైసీపీ ఓట్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీగా గండి కొట్టనున్నారని చెబుతున్నారు. జనసేన పార్టీకి 8.9 శాతం మంది జై కొట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టీడీపీకి మంచి మద్దతు లభించగా, ఉత్తరాంధ్రలో వైసీపీ బలంగా ఉంది.
లగడపాటి రాజగోపాల్ ఆర్జీ ఫ్లాష్ సర్వే: నగరిలో మళ్లీ రోజాదే గెలుపు
టీడీపీకి 110, వైసీపీకి 60
44 శాతం ఓటర్ల మద్దతుతో టీడీపీ 110 సీట్లు సాధించి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఈ సర్వేలో తేలింది. 2014 ఎన్నికలతో పోలిస్తే మరో 8 సీట్లు అదనంగా టీడీపీ గెలుచుకోనుంది. వైసీపీ 60 స్థానాలతో రెండో స్థానంలో ఉండనుంది. జగన్ పాదయాత్ర చేసిన జిల్లాల్లో కంటే ఇంకా ఆయన పాదయాత్ర చేయని ఉత్తరాంధ్రలోనే పార్టీ పరిస్థితి బాగుంది. చంద్రబాబు పనితీరుకు ఎక్కువ మంది ఓటేశారు. సర్వేలో టీడీపీకి అనుకూలంగా 44 శాతం ఓట్లు రాగా, చంద్రబాబు పని తీరుకు 53 శాతానికి పైగా మద్దతిచ్చారు.
2016లో టీడీపీ - బీజేపీకి కలిసి 120 సీట్లు
ఇదే బృందంతో 2016 నవంబర్ నెలలో సర్వే చేసినప్పుడు టీడీపీ - బీజేపీ కూటమికి 120 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇప్పుడు టీడీపీకి ఒంటరిగా 110 సీట్లు వస్తాయని తేలింది. నాడు వైసీపీ 50 సీట్లు గెలుస్తుందని అంచనా వేయగా, నేడు 60 సీట్లకు పెరిగింది. కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి దారుణంగా ఉందని సర్వేలో తేలిందని చెబుతున్నారు.
చంద్రబాబు పనితీరు
చంద్రబాబు పని తీరు బాగుందని 53 సాతం మంది చెప్పగా, 46 శాతం మంది బాగా లేదని చెప్పారు. పార్టీ, ఎమ్మెల్యేల పని తీరు కంటే చంద్రబాబుకే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరోవైపు, కేంద్రం రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని 83 శాతం మంది అభిప్రాయపడ్డారు. 16 శాతం మంది మాత్రమే న్యాయం జరిగిందన్నారు. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ నియోజకవర్గం రాజమండ్రిలో 78 శాతం మంది ఏపీకి అన్యాయం జరిగిందని అశంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రత్యేక హోదాపై బీజేపీపై ఆగ్రహం
ప్రత్యేక హోదా సాధనకు టీడీపీ గట్టిగా పోరాడుతుందని 43 శాతం మంది చెబితే, వైసీపీ పోరాటానికి ఓటేసినవాళ్లు 40 శాతం మంది ఉన్నారు. జనసేన బాగా పోరాడుతోందని 9.5 శాతం మంది చెప్పారు. హోదా సాధనా సమితి పోరాడుతోందని 2.5 శాతం మంది చెప్పారు. వామపక్షాల పోరాటానికి కేవలం ఒక శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. మోడీ ఏపీకి న్యాయం చేయలేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు.
జనసేనకు మద్దతు ఎలా ఉందంటే?
2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన భావిస్తోంది. అలాంటి పార్టీకి సర్వేలో 8.96 శాతం ఓట్లు వచ్చాయి. సర్వే చేసిన జిల్లాల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గంలో మాత్రమే పవన్కు అత్యధికంగా 16 శాతం మద్దతు లభించింది. పవన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న తూర్పు గోదావరి జిల్లాలో మద్దతు ఏమాత్రం ఆశించినంత లేదు. ధర్మవరంలో అత్యల్పంగా 0.25 శాతం ఉంది. ఇక, పవన్ ఆరంగేట్రం వల్ల టీడీపీకి పెద్దగా నష్టం లేదని, చిరంజీవి ప్రజారాజ్యం లాగే జనసేన విపక్ష ఓట్లను (ఇప్పుడు వైసీపీ) చీల్చబోతుందని సర్వే ద్వారా అర్థమైందంటున్నారు.