పోతే పోనియ్యండి తమ్ముళ్లూ..! ఎక్కడైనా టు లెట్ బోర్డ్ కనిపిస్తే చెప్పండి..! మారిపోదాం అంటున్న బాబు..!
అమరావతి/హైదరాబాద్: ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ప్రజావేదికను నేలమట్టం చేసారు. ఎక్కడ లక్రమ కట్టడాలు నిర్మించినా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరికలు జారీ చేసారు. నాటకీయ పరిణామాల మధ్య ప్రజావేదిక కాలగర్భంలో కలిసిపోయింది. మాజీ సీఎం వినతిని పట్టించుకోని ఏపీ సీఎం జగన్ ప్రజావేదికను చెప్పినట్టుగానే కూల్చేశారు. ఈ కూల్చివేత టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయడం వల్ల జగన్కు ఒరిగిందేంటని టీడీపీ ప్రశ్నిస్తుంటే, చంద్రబాబు అక్రమంగా నిర్మించారని.. అందుకే కూల్చేశామని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు ప్రజావేదికను తమకు కేటాయించాలని కోరినందువల్లే జగన్ కక్షపూరితంగా వ్యవహరించి ప్రజావేదిక కూల్చివేతకు పూనుకున్నారని టీడీపీ విమర్శిస్తోంది.
కాలగర్బంలో కలిసి పోయిన ప్రజావేదిక..! కూల్చివేత సంపూర్ణం..!!
ఇరు పార్టీల మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధాన్ని కాసేపు పక్కనపెడితే.. ప్రజావేదిక పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమమని వైసీపీ పదేపదే చెబుతోంది. ప్రజావేదిక కూల్చివేత విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయంతో ప్రస్తుతం చంద్రబాబు ఉంటున్న నివాసాన్ని కూడా కూల్చివేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే.. చంద్రబాబు నివాసంపై కోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ ఈ చర్యకు పూనుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కూల్చివేతకు ఏ మాత్రం అవకాశం ఉన్నా సీఎం జగన్ చంద్రబాబు నివాసం విషయంలో ఉపేక్షించే పరిస్థితి లేదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.
తమ్ముళ్లతో బాబు మంతనాలు..! ఓదార్చుకుంటున్న నేతలు..!!
ఇదిలా ఉంటే.. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో ఇంటి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గుంటూరు, విజయవాడకు త్వరగా చేరుకునేందుకు వీలుగా ఇంటిని చూడాలని పార్టీ నేతలకు ఇప్పటికే ఆయన సూచించినట్లు సమాచారం. దీంతో టీడీపీ సీనియర్ నేతలు చంద్రబాబు ఉండేందుకు అనువైన నివాసం కోసం వెతుకులాట ప్రారంభించారట. ఇదిలా ఉంటే.. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నేతలు చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తామని ముందుకొస్తున్నారట.
ఏపీ ప్రభుత్వం కక్ష పూరిత చర్యలతో వెళ్తోంది..! టీడిపి నేతల ఆరోపణలు..!!
ఏపీ ప్రభుత్వం ఓర్వలేనితనంతోనే ప్రజావేదికను కూల్చివేస్తోందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం కక్ష పూరిత చర్యలతో వెళ్తుందని ఆరోపించారు. అందుకు ప్రజావేదిక భవనం కూల్చడం ఒక నిదర్శనంగా పేర్కొన్నారు. ప్రజావేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం సరికాదన్నారు. సీఎం చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కళా వెంకట్రావు అన్నారు. కాగా ప్రజావేదిక భవనం కూల్చివేత పనులను మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
మిగతా నిర్మాణాలనూ కూల్చివేయాలి..! ప్రభుత్వానికి టీడిపి సలహాలు..!!
ఉండవల్లిలో ప్రజావేదిక కూల్చివేత సరికాదని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అడిగారన్న కారణంతోనే ప్రజావేదికను కూల్చారన్నారు. అది అక్రమ కట్టడమైతే అంతటితో ఆగొద్దని.. మిగతా అక్రమ నిర్మాణాలనూ కూల్చివేయాలని పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఉరవకొండలో జరుగుతున్న అరాచకాలపై సీఎంకు లేఖరాస్తానని పయ్యావుల స్పష్టం చేశారు.