వైసీపీలోకి వెళ్తే తన నంబర్ 152.. జనసేనలో నేనే నంబర్ 1 .. జనసేన ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రభంజనం సృష్టిస్తుంది అనుకున్న జనసేన పార్టీ గడచిన ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఏకంగా జనసేన పార్టీ నుండి రెండు స్థానాల్లో పోటీ చేసిన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఓటమిపాలయ్యారు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ నుండి విజయం సాధించి ఒకే ఒక్కడు గా నిలిచాడు.
మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ ను కలిసిన జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచిన తర్వాత రాపాక వరప్రసాద్ తొలిసారిగా శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ ను కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన ముఖ్య కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఒకే ఒక్కడు రాపాక వరప్రసాద్ కూడా పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేసి ఉంటే, 2019 ఎన్నికల్లో ఫలితాలు ఈ విధంగా ఉండేవి కాదేమో అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
పవన్ బాటలో నైతిక విలువలతో సాగాలని కోరిన జనసేన ఎమ్మెల్యే రాపాక
ఇక రాజోలు ఎమ్మెల్యే తనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన అధినేత పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ జనసేన నాయకులను కోరుకుంది అదేనని, అందరూ నైతిక విలువలు పాటిస్తూ అధినేత పవన్ చూపించిన మార్గంలో నడవాలని ఆయన కోరారు. పవన్ ఏ ఒక్కరిని ఎన్నికల్లో విజయం సాధించడానికి నీచ రాజకీయాలు చేయమని ప్రోత్సహించలేదని ఆయన పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా , డబ్బుకు, మద్యానికి ఓట్లను కొనుగోలు చేయకుండా స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలని కోరారని రాపాక వరప్రసాద్ తెలిపారు .
వైసీపీలో చేరికపై రాపాక క్లారిటీ .. జనసేనలోనే ఉంటానని వెల్లడి
ఇక జనసేన పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిక అంశంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే తన నెంబర్ 152 అవుతుందని అదే జనసేనలో ఉంటే తన నెంబర్ 1 అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లే ఆలోచన లేదని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. ఏదేమైనా సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన తాము ఓడినా స్వచ్ఛ రాజకీయాలు చేసి తామే గెలిచామన్న ధీమాలో ఉంది.