ఎవడిని కొట్టేస్తానో నాకే తెలియదు: సహనం కోల్పోతే..అంతే: స్పీకర్ తమ్మినేని ఆగ్రహం..!
స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి అధికారుల పైన విరుచుకు పడ్డారు. కొంత కాలంగా సీతారాం ఏది మాట్లాడినా వివాదాస్పదం అవుతోంది. కొద్ది కాలం క్రితం ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్కారం తనను ఆహ్వానించకపోవటం పైన బీసీ సంక్షేమ అధికారుల పైన స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
అదే విధంగా రాజధాని అమరావతి గురించి ఆయన చేసిన వ్యాఖ్యల పైన ప్రతిపక్షాలతో సహా..రాజధాని ప్రాంత వాసులు తప్పుబడుతున్నారు. ఇక, ఇప్పుడు స్పీకర్ అదే తరహాలో మరోసారి వ్యాఖ్యలు చేసారు. సహనం కోల్పోతే..ఎవడిని కొట్టేస్తానో నాకే తెలియదు అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో..స్పీకర్ అధికారుల పైన విరుచుకుపడటం పైన రాజకీయంగానూ చర్చ సాగుతోంది.
అధికారులపై స్పీకర్ ఫైర్..
స్పీకర్ తమ్మినేని సీతారాం మరో సారి సొంత జిల్లాలో అధికారుల పైన మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఆయన బీసీ సంక్షేమ అధికారుల పైన చేసిన వ్యాఖ్యల పైన అప్పట్లో చర్చ సాగింది. ఇక, ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం కట్యాచార్యులపేటలో సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు, మిల్లర్లు తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదని పలువురు రైతులు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అధికారుల తీరుపై స్పీకర్ అసహనం వ్యక్తం చేశారు.
నేను సహనం కోల్పోతే
ఇక రైతుల ఫిర్యాదుపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ.. నేను సహనం కోల్పోతే ఎవడిని కొట్టేస్తానో నాకే తెలియదు అంటూ అధికారుల పైన ఫైర్ అయ్యారు. దీంతో..అక్కడ ఉన్న అధికారులు ఒక్క సారిగా విస్తుపోయారు. అయితే, రైతుల సమస్య కావటంతో స్పీకర్ అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తారా అంటూ ఆ స్థాయిలో ఆగ్రహం ప్రదర్శించారని పార్టీ నేతలు చెబుతున్నారు.
అమరావతి నిరసనల పైనా..
విశాఖకు రాజధాని రావాలని...ఉత్తరాంధ్ర ప్రాంతం అప్పుడే డెవలప్ అవుతుందని చెబుతూ తమ జిల్లాల్లో నెలకొన్ని పరిస్థితుల పైన స్పీకర్ తమ్మినేని కొద్ది రోజుల క్రితం భావోద్వేగానికి గురయ్యారు. అంతకు ముందు ఎడారి అంటూ అమరావతిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు రాజకీయ నేతలు తప్పుపట్టారు.
చంద్రబాబు, పవన్ అభ్యంతరం
అమరావతిలో ఏముంది అదంతా ఎడారి అంటూ చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేన అధినేత పవన తో సహా రాజధాని ప్రాంత రైతులు..స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసారు. ఎడారి అయితే ఇక్కడ నుండి ఎలా పాలన చేస్తున్నారని వారు ప్రశ్నించారు. ఇక, ఇప్పుడు వరుసగా రెండో సారి అధికారులను ఉద్దేశించి స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయటం..ఆయన చేసిన వ్యాఖ్యల పైన చర్చ సాగుతోంది.