పాలన చేతకాకపోతే చంద్రబాబుని అడగండి : టీడీపీ మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ పాలన పై టిడిపి మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. ఏపీ లో ఇసుక కొరత పై మాట్లాడిన ఆమె ఇతర రాష్ట్రాల్లో లేని సమస్య ఏపీ లోని ఎందుకు వచ్చింది అని ప్రశ్నించారు. ఇసుక కొరత ప్రభుత్వ వైఫల్యం అని అనిత మండిపడ్డారు.
ఇసుక దోపిడీ నివారణోత్సవాలు జరపండి అన్న అనిత
టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలను గురించి మంత్రులు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. దీంతో నిర్మాణ రంగం కుదేలు అయిందన్న అనిత నిర్మాణ రంగ కార్మికులకు పనులు కల్పించలేని ప్రభుత్వం ఆత్మహత్యలను హేళన చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.సీఎం జగన్మోహన్ రెడ్డి ఇసుక కొరత తీర్చడానికి ఇసుక వారోత్సవాలు జరిపే కంటే ఇసుక దోపిడీ నివారించడానికి ఇసుక దోపిడీ నివారణ ఉత్సవాలను పెడితే బాగుంటుందని ఆమె హితవు పలికారు.
ఇతర రాష్ట్రాల్లో లేని వరదలు ఇక్కడే వచ్చాయా అని ప్రశ్న
మంత్రులు వరదల వల్ల ఇసుక కొరత ఏర్పడిందని చెబుతున్నారని అయినా ఇతర రాష్టాల్లో లేని వరద ఒక్క ఏపీలోనే ఉందా? అంటూ అనిత ప్రశ్నించారు. ఇక అంతే కాదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అందరూ పరిపాలనాదక్షులే అని కాకుంటే పాలనే లేదని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వరదల వల్ల ఏపీ లో ఇసుక కొరత ఉంది కానీ వైసీపీ నేతలు ఇతర రాష్ట్రాలకు తరలించే ఇసుకకు వరద వల్ల ఎలాంటి ఇబ్బంది లేదా? అని నిలదీశారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన చేతకాకపోతే చంద్రబాబును అడిగితే సలహాలు ఇస్తారన్నారు వంగలపూడి అనిత.
ఢిల్లీ వెళ్లి కాళ్ళు పట్టుకోవటంపైనే సీఎం శ్రద్ధ అన్న అనిత
అంతేకాదు రాష్ట్రంలో భవనాలకు వైసిపి రంగులు వేయడానికి ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రంగులు వేయడానికి పెట్టే ఖర్చుతో భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవచ్చని సూచించారు అనిత. ప్రభుత్వ చర్య వల్ల ఉపాధి పోగొట్టుకున్న నిర్మాణ రంగ కార్మికులకు ప్రతి కార్మిక కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి కాళ్ళు పట్టుకోవడంపై ఉన్న శ్రద్ద కార్మికులపై చూపడం లేదని వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ ఏపీలో ఇసుక కొరత విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం లో నేతలు ఏమాత్రం తగ్గడం లేదు.
నిర్మాణ రంగ కార్మికులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్
నిన్నటికి నిన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఒక్క రోజు దీక్ష చేశారు. ఇక మాజీ సీఎం చంద్రబాబు సైతం ఇసుక వారోత్సవాలు చెయ్యాలని చెప్పటం సిగ్గుచేటని విమర్శలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అటు టీడీపీనే కాకుండా బీజేపీ, జనసేన పార్టీలు సైతం ఇసుక కోసం సమరం చేస్తున్నాయి. నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.