జేసీ నోటిదురుసు చంద్రబాబును ఇరుకున పెడుతోందా ? ఆ రెండు ఎన్నికలు రద్దుచేయాలన్న సీపీఐ
హైదరాబాద్ : వివాదాలకు కేంద్రబిందువు, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి. ఆయన ఏం మాట్లాడిన సంచలనమే. అయితే ఏపీలో ఎన్నికలు ముగిసాయో లేదో ఓటర్ల డబ్బులు నోటి దూల చాటుకొన్నారు. ఓటుకు 2 వేలు ఇయ్యనిదే వేయలేదని చెప్పి .. తనతోపాటు పార్టీ అధినేత చంద్రబాబును ఇరికించే ప్రయత్నం చేశారు. ఇంతకీ టీడీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చుచేశారా ? ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు కోట్లు గుమ్మరించారా ? అధికార పార్టీ ఎంపీ కామెంట్లు ఇప్పుడు కాకరేపుతోన్నాయి.
బరిలో వారసులు
అనంతపురం నుంచి జేడీ కుమారుడు పవన్, తాడిపత్రి నుంచి ఆయన సోదరుడి కుమారుడు హర్షిత్ రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఈ నెల 11న పోలింగ్ జరుగగా .. సోమవారం జేసీ నాలుక కరచుకొన్నాడు. ఆయా నియోజకవర్గాల్లో డబ్బులు పంచనిదే ఓటు వేయడం లేదని .. తినడానికి లేని వాళ్లు కడా ఓటుకు ఐదు వేలు డిమాండ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో అనంతపురం, తాడిపత్రిలో ఓటుకు 2 వేలు చొప్పున .. వంద కోట్ల వరకు పంచామని సెలవిచ్చారు.
పసుపు-కుంకుమను వదల్లేదు
అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ ఎన్నికల కన్నా ఎక్కువ రోజులు ముందు ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని తన నోటి దూలను నిరూపించుకున్నాడు. తామే కాదు ప్రభుత్వ కార్యక్రమం ద్వారా నగదు పంచామని పరోక్షంగా అంగీకరించారు జేసీ. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లకు నగదు పంచడం నేరం. కానీ ఓ ఎంపీ తామే స్వయంగా నగదు పంచామని చెప్పడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతోంది.
బాబుకు ఉచ్చు బిగుస్తోందా ?
ఆ ఎంపీతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోందా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే కేంద్రంపై పోరాటం చేస్తున్న చంద్రబాబు .. తమకు అందివచ్చిన అవకాశామని మోదీ భావిస్తే చర్యలు తీసుకొనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇటీవల ఆయన ఈవీఎంలపై అనుమానాలు, అధికారుల బదిలీపై కేంద్రంతో యుద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ వ్యాఖ్యలు చంద్రబాబును ఇరుకున పడవేసే అవకాశం ఉంది.
ఎన్నికలు రద్దుచేయండి
జేసీ నాలిక కరచుకున్నారో లేదో వెంటనే విపక్షాలు స్పందించాయి. అనంతపురం, తాడిపత్రి నియోజకవర్గాల ఎన్నికలు రద్దు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఓటుకు రూ.2 వేల చొప్పున పంచామని .. జేసీ చేసిన వ్యాఖ్యలను ఫిర్యాదులో ప్రస్తావించారు. ఎన్నికల వేళ కోట్లాది రూపాయలు వెదజల్లి, నిబంధనలకు పాతర వేశారని .. 30 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు, జేసీ లాంటి నేతలు రాజకీయాలను దిగదార్చారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జేసీ కామెంట్లను ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని ... అనంతపురం లోక్ సభ, తాడిపత్రి అసెంబ్లీ ఎన్నికను రద్దుచేయాలని కోరారు.