పని చేసి ప్రచారంలో వెనుకబడ్డాం.. అవసరమైతే టీడీపీ వాళ్ళకు కరోనా టెస్టులు చేస్తాం : బ
కరోనా ఏపీలో కలకలం రేపుతుంది. రోజు రోజుకీ పెరుగుతున్న కేసులు ఏపీ సర్కార్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఇక మరోపక్క ప్రతిపక్షాల విమర్శలు ఆదిలోనే కంట్రోల్ చెయ్యలేకపోయారని చేస్తున్న వ్యాఖ్యల నేపధ్యంలో మంత్రులు టీడీపీ నేతలకు రివర్స్ కౌంటర్ ఇవ్వటానికి రంగంలోకి దిగారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిరోజు సమీక్షిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్సా సత్యన్నారాయణ తెలిపారు.
టీడీపీవి అనవసరపు ఆరోపణలు
కరోనా టెస్టులు చెయ్యటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి బొత్సా సత్యన్నారాయణ టీడీపీ అనవసరపు ఆరోపణలు చేస్తుందని, అవసరం అయితే వారికి కూడా కరోనా టెస్టులు చేస్తామని చురకలు అంటించారు . నేడు మీడియాతో మాట్లాడిన బొత్సా ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి వైరస్ నియంత్రణకు సహకరించాలని అన్నారు. అందరూ తప్పకుండా సామాజిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనా టెస్టుల విషయంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీ ముందంజలో ఉందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
ప్రతిరోజూ సమీక్షలు చేస్తున్నాం .. పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం
కరోనా ప్రభావం తీవ్రంగా ఉందన్న ఆయన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజూ సమీక్షలు జరుపుతూ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్న ఆయన ఏపీ మొత్తం 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అన్నారు. వ్యాప్తికి కారణలేమైనా ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటోందని బొత్సా పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నా విమర్శలు చెయ్యటం మంచిది కాదన్నారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ప్రజలకు ఆయన సూచించారు.
2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం చేశామన్న మంత్రి
ఇక ఢిల్లీ తబ్లీఘీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పూర్తి స్థాయిలో ఆరోగ్య సర్వే చేయిస్తున్నామన్న బొత్స ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు,వాలంటీర్లకు ప్రజలు సహకరించాలని అన్నారు. ఇక సరిహద్దుల్లో ఉన్నవారికోసం భోజన వసతి ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. 950 రైతు బజార్లు, మొబైల్ రైతు బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 2 వేల క్వారంటైన్ బెడ్లు సిద్ధం చేశామన్న ఆయన నియోజకవర్గ స్థాయిలో కరోనా కట్టడికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం
కరోనా విషయంలో ప్రభుత్వం అలసత్వంతో ఉందనే రీతిలో చంద్రబాబు కామెంట్లు చేశారని, చేసింది చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదని అన్నారు. ఒకవేళ అలసత్వం చేస్తే అది ప్రచారం చేసుకునే విషయంలో అయ్యి ఉండొచ్చని ఆయన చురకలు వేశారు . అవసరమైతే టీడీపీ వాళ్లకూ టెస్టులు చేస్తామని చెప్పిన బొత్సా హైదరాబాదులో కూర్చొని విమర్శలు చేయడం తగదని అన్నారు. కరోనాను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు . ఇప్పుడు విమర్శలు చేసుకునే సమయం కాదని బొత్సా పేర్కొన్నారు.