ఢిల్లీకి సైకిల్ యాత్ర!: అఖిలప్రియ, పవన్ కళ్యాణ్ వల్లే మాకు సీట్లు తగ్గాయి: షాకింగ్ కామెంట్స్
కడప/అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అవసరమైతే ఢిల్లీకి సైకిల్ యాత్ర చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ మంగళవారం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ఉక్కు పరిశ్రమ కోసం అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రం మెడలు వంచి అయినా ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని, అందుకు సీఎం చంద్రబాబే కారణమన్నారు.
Recommended Video
అదే జరిగితే జనసేన కథ ముగిసినట్లే: పవన్కు హెచ్చరిక, తెరవెనుక ఏం జరుగుతోంది?
మరోవైపు, కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న దీక్ష పైన జనసేన పార్టీ విమర్శలు గుప్పించింది. టీడీపీ దీక్షలో చిత్తశుద్ధి లేదని ఆరోపించింది. కడప ఉక్కు సాధనకు ఈ నెల 29న అఖిలపక్షం చేపట్టే బంద్కు మద్దతు పలుకుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం మాట్లాడారు.
ఇన్నాళ్లు పట్టించుకోలేదు
సీఎం రమేష్, బీటెక్ రవిల దీక్షలు కొంగ జపాన్ని తలపిస్తున్నాయని జనసేన ఎద్దేవా చేశారు. కేంద్రంలో అధికారం పంచుకున్నంత కాలం స్టీల్ ప్లాంట్ విషయాన్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు చేస్తున్న దీక్షల్లో చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంటు కోసం జరిగే బంద్లో జనసేన పార్టీ శ్రేణులు పాల్గొంటాయని తెలిపారు.
దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు చంద్రబాబు ఫోన్ చేసి మరీ
దీక్ష చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించమంటారా? అని అడుగున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడగలమని మాదాసు ప్రశ్నించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు కోసం జనసేన రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు.
కేంద్రం కూడా ఏపీ ప్రజల సహనాన్ని పరీక్షిస్తోందన్నారు. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని చెబుతున్న కేంద్రం.. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఐరన్ ఓర్ గనులను కూడా కేటాయించడం లేదన్నారు.
బీజేపీ కూడా తన వైఖరి మార్చుకోవాలి
ఆంధ్రప్రదేశ్ పట్ల బీజేపీ తన వైఖరి మార్చుకోవాలని మాదాసు అన్నారు. పవన్ కళ్యాణ్ పోరాటయాత్ర 28వ తేదీన మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పవన్ను ఎంతో వేధించిందన్నారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే అంటూ ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలను నిర్లక్ష్యం చేస్తే జనసేన తప్పకుండా ప్రశ్నిస్తుందని తెలిపారు. అమరావతితోపాటు అన్ని ప్రాంతాలనూ సమాన అభివృద్ధి చేయాలన్నారు. పవన్ ముఖ్య నేతలతో సమావేశమై తొలి విడద పర్యటనపై సమీక్షించారని చెప్పారు.
పవన్ కారణంగా 104 సీట్లకు పడిపోయాం
కడపకు స్టీల్ ప్లాంట్ రాకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణం కాదని ఎంపీ కేశినేని నాని మంగళవారం తెలిపారు. అసలు టీడీపీ నేతలు అడ్డుకుంటే కియో మోటార్స్ వచ్చేదే కాదన్నారు. పవన్ కళ్యాణ్ అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు దూరం పెడతారని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్కు రాజకీయ పరిపక్వత లేదని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా 124 సీట్ల నుంచి 104 సీట్లకు పడిపోయామని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో పవన్ వల్లే తమకు సీట్లు వచ్చాయని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు ఓ బ్రోకర్ అని బుద్ధా వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పవర్ బ్రోకర్ అన్నారు. అసలు ఏపీలో ఆయనకు అడ్రస్సే లేదని ఎద్దేవా చేశారు. 2019లో టీడీపీ గాలిలో వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కొట్టుకుపోతాయని తెలిపారు.