పులివెందుల రౌడీలు కాదు.. ఉత్తరాంధ్ర ప్రజలే, రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? చంద్రబాబుకు అవంతి సవాల్
విశాఖలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో అగ్గిరాజేసింది. పులివెందుల రౌడీలతో యాత్రను అడ్డుకున్నారని చంద్రబాబు చేసిన కామెంట్లను మంత్రి అవంతి శ్రీనివాస్ ఖండించారు. బాబు యాత్రను అడ్డుకుంది ఉత్తరాంధ్ర ప్రజలేనని స్పష్టంచేశారు. విశాఖను రాజధానిగా అంగీకరించబోమని టీడీపీ చేసిన ప్రకటనతో ప్రజలే కదిలొచ్చారని చెప్పారు. గురువారం విశాఖ ఎయిర్పోర్టులో పులివెందులకు చెందినవారు ఉన్నారా..? నిరూపించగలరా అని చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటారా..?
ఎయిర్పోర్టులో పులివెందులకు చెందినవారు ఉన్నట్టు రుజువు చేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు నాయుడును కోరారు. అడ్డుకున్న వారంతా ఉత్తరాంధ్ర ప్రజలేనని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ విసిరారు. ఒకవేళ వారిలో ఒక్కరైనా పులివెందులకు చెందినవారు ఉన్నారని నిరూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అందుకు మీరు సిద్దమా అంటూ చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు.
ఉత్తరాంధ్ర ప్రజలే..బాబూ...
ప్రజా చైతన్య యాత్రను అడ్డుకునేందుకు బయటినుంచి మనుషులను తెప్పించాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి పేర్కొన్నారు. నిన్న వచ్చింది ఉత్తరాంధ్ర ప్రజలేనని తేల్చిచెప్పారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించనప్పటీ నుంచి చంద్రబాబు వెళ్లగక్కుతన్న అసహనాన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఓ వైపు రాజధాని అంగీకరించమని చెబుతూనే.. మరోవైపు ప్రజా చైతన్య యాత్ర ఏంటీ అని ప్రజలు అడ్డుకున్నారని తెలిపారు. కానీ దానిని కూడా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన చేసే రాజకీయాలను ఎవరూ సహించబోరని చెప్పారు.
Recommended Video
రాజీనామాకు రె‘ఢీ'
విమానాశ్రయంలో తనను అడ్డుకున్నది పులివెందుల రౌడీలు అని చెప్పి ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. అక్కడ లేనివారి గురించి ఆరోపించి.. స్థాయిని దిగజార్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. పులివెందులకు చెందినవారు లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారా... తన సవాల్ స్వీకరించాలని కోరారు. ఒకవేళ ఒక్కరు ఉన్న తన మంత్రి పదవీకి రాజీనామా చేసి.. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని అవంతి శ్రీనివాస్ ప్రకటించారు.