వివేకా హత్యతో సంబంధం ఉంటే నడిరోడ్డు మీద కాల్చి చంపండి..! టీడిపి సతీష్ రెడ్డి ఘాటు స్పందన..!
కడప/హైదరాబాద్ : వివేకానంద రెడ్డి హత్యపై ఆరోపణలు ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి, అదికార టీడిపి, ప్రతి పక్ష వైసిపి నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని పులివెందుల టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డి విమర్శించారు. నీచమైన రాజకీయాల కోసం వివేకానందరెడ్డి మృతిని ఉపయోగించుకుంటున్నారని, చంద్రబాబు నాయుడు, లోకేష్ తాను హత్య చేశారని చెప్పడం అసత్యమన్నారు.
ఈ ప్రకటనతో వీళ్ల మనస్తత్వం ఏంటనేది బయటపడిందని సతీష్ రెడ్డి అన్నారు. తప్పు ఉందని నిర్ధారణ జరిగితే నడిరోడ్డు మీద కాల్చి చంపండని సవాల్ విసిరారు. వాస్తవాలు వెలుగు చూసినప్పుడు తీవ్రమైన మూల్యం చెల్లించుకుంటారని అన్నారు. హత్యలు చేసే సంస్క్రుతి ఎవరిదో పులివెందుల్లో ఎవరిని అడిగినా చెప్తారని అన్నారు. డీజీపీని నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరామన్నారు. ఆరోపణలు చేసే మీరే, సీబీఐ తో విచారణకు జరిపించాలని కోరితే నేను స్వాగతిస్తానని అన్నారు. ఇటువంటి ఆరోపణలు చేసే మీకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు సతీష్ రెడ్డి.
వివేకాది హత్యే : ఏడు కత్తి పోట్లు గుర్తింపు : పోస్టుమార్టం లో తేల్చిన వైద్యులు..!
ఇదిలా ఉంటే వైఎస్. వివేకానంద రెడ్డి ది హత్య అని తేలిందని వైసీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వివేకానంద రెడ్డి జమ్మలమడుగు లో ప్రచారం చేసి వచ్చారని, ఆదినారాయణ రెడ్డి కి కడప ఎంపీ టికెట్ ప్రకటించినప్పుడే హత్యకు కుట్ర జరిగిందని శ్రీనివాస్ వెళ్లడించారు. వివేకా హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని వైసీపి మరో నేత మల్లాది విష్ణు అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా?, సాక్షాత్తూ ఒక మాజీ సీఎం సోదరుడు, ప్రతిపక్ష నేత బాబాయ్ హత్యకు గురికావడం తో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఇందులో మంత్రి ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందని. హత్యా రాజకీయాలతో అధికారంలోకి రావాలి అని టీడీపీ ప్రయత్నిస్తుందని ఘాటుగా విమర్శించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు.