పవన్ మాతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడిని ..జగన్ది క్రిమినల్ మనస్తత్వం.. పాల్ సంచలనం
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేసిన కేఏ పాల్ తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ ది క్రిమినల్ మనస్తత్వం అన్న పాల్
మొదట నుండి వైసీపీ మీద విరుచుకుపడుతున్న పాల్ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై తాజాగా వ్యాఖ్యలు చేస్తూ.. జగన్ది క్రిమినల్ మనస్తత్వమని, ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా పని చేస్తే వారిని ఎలిమినేట్ చేయాలని ప్రయత్నిస్తారని కేఏ పాల్ విమర్శలు చేశారు. తాను చంద్రబాబు రహస్య మిత్రుడ్ని అని జగన్ తనపై చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని కేఏ పాల్ అన్నారు.
పవన్ తనతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్ళేవాడినన్న పవన్
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేస్తూ.. పవన్ పై తనదైన శైలిలో మాట్లాడారు కే ఏ పాల్ . పవన్ కళ్యాణ్ తమతో కలిస్తే ఎక్కడికో తీసుకెళ్లే వాడినని ఆయన చెప్పారు. పవన్ కళ్యాణ్ కు చిత్త శుద్ధిలేదని, నిత్యం సామాజిక న్యాయం అని చెప్పే పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంచారని కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
డబ్బు కోసం పవన్ ఎలాంటి వేషమైనా వేస్తాడన్న కేఏ పాల్
చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య మాత్రం మంచి అవగాహన ఉందని పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి వారో, ఆయన సన్నిహితులను అడిగితే తెలిసిపోతుందని పేర్కొన్న పాల్ , ఆయన ఒట్టి డబ్బు మనిషి అని, డబ్బు కోసం ఎలాంటి వేషాలు అయినా వేస్తారని పాల్ అన్నారు. మరి పాల్ వ్యాఖ్యల పై జనసేన్, వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాలి.