గెలిస్తే పవన్ ఏ సీటు వదులుకుంటారో చెప్పాలి..! రెండు చోట్ల పోటీపై ఆసక్తికర చర్చ..!!
అమరావతి/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, రెండోది విశాఖపట్నం జిల్లా గాజువాక. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక పలు కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. పవన్ స్వస్థలం మొగల్తూరు గ్రామం భీమవరానికి సమీపంలోనే ఉండడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. భీమవరం పట్టణంలో కొన్ని రోజులు విద్యాభ్యాసం చేశారు. ఆయనకు ఇక్కడ చాలామంది క్లాస్ మెట్స్, స్నేహితులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పట్టణం కావడంతో ఆయన ఎంపిక చేసుకోవడానికి కారణంగా చెబుతున్నారు.
భీమవరం పోటీ అందుకేనా...! కాపు కాసేది ఎవరినో..!!
ఇక్కడి నుంచి పోటీ చేయడం ద్వారా పక్కనే ఉన్న పాలకొల్లు, ఉండి నియోజకవర్గాలపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని పార్టీ అంచనా వేసింది. ఈ నియోజకవర్గంలో కాపు కులం ఓట్లు సుమారు 60 వేల వరకు ఉన్నారని అంచనా. వీరిలో సగం మంది జనసేనకు మొగ్గు చూపిన విజయం సునాయసం అనేది పార్టీ పెద్దలు చెబతున్నారు. అయితే ఇక్కడ త్రిముఖ పోటీ ఉంది. టీడీపీ నుంచి రెండుసార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులు, వైసీపీ నుంచి గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ కాపు కులానికి చెందినవారే కావడం ఆసక్తిగా మారింది.
భీమవరంలో బలమైన ప్రత్యర్థులు..! గబ్బర్ సింగ్ బయటపడతాడా..?
గ్రంధి శ్రీనివాస్ 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2009, 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. వరుసగా రెండుసార్లు ఓడిపోయినందున గ్రంధి శ్రీనివాస్ పై ఓటర్లలో కొంత సానుభూతి కన్పిస్తోంది. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్ కు వైసీపీ అధినేత జగన్ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన భీమవరం నుంచి గ్రంధీ శ్రీనివాస్ గెలిచి వస్తే ఆయనకు కీలక మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పవన్ ను ఓడించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో పేరు తెచ్చుకునేందుకు అటు టీడీపీ, ఇటు వైసీపీ అభ్యర్థులు తమ శక్తియుక్తులు కూడబెడుతున్నారు.
గాజువాక నియోజకవర్గానికి నామినేషన్ వేసిన పవన్ కళ్యాణ్ (ఫొటోలు)
భీమవరంలో త్రిముఖ పోటీ..! కాటమరాయుడు వ్యూహం ఏంటి..?
ముఖ్య నాయకులు, పార్టీ అధినేతలు రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయడం కొత్త కాదు. గతంలో ఎన్టీఆర్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. ఇద్దరు కూడా ఒక స్థానంలో గెలిచి, మరో స్థానంలో ఓటమి పాలయిన విషయం విదితమే.గత అనుభవాల నేపధ్యంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సైతం వ్యూహాత్మకంగా రెండు స్థానాలనుంచి పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇదిలా ఉండగా గతంలో అనంతపురం జిల్లా నుంచి పవన్ పోటీ చేస్తారని ప్రకటించారు. అయితే అక్కడ అనుకూల వాతావరణం లేదని సర్వేల్లో తేలడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. కాపు కులంవారు అత్యధికంగా వున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగరంలోని గాజువాక సురక్షితమైనవిగా గుర్తించారు. ఓక చోట ఓడిపోయినా, మరో చోట గెలుస్తామనే ధీమాతో పవన్ ఉన్నారు.
పవన్ పారదర్శకత..! ఏ నియోజక వర్గాన్ని ఒదులుకుంటారో చెప్పాలంటున్న నెటిజన్లు..!!
తనకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదని నిత్యం చెప్పే కాటమ రాయుడు, కాపు కులం వాళ్లు అత్యధికంగా వున్న ప్రాంతాల నుంచి పోటీ చేయడం పట్ల సామాజిక మద్యమాల్లో పెద్ద యెత్తున చర్చ జరుగుతోంది. రాయలసీమలోని అనంతపురం నుంచి ఎందుకు పోటీ చేయడం లేదని ప్రత్యర్ధులు అప్పుడే విమర్శలు సంధిస్తున్నారు. కాపు కులం వాళ్లు అధికంగా ఉన్నచోటే పవన్, ఆయన పార్టీ నాయకులు బరిలోకి దిగుతున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. పవన్ రెండు చోట్ల గెలిస్తే ఒక స్థానంలో తిరిగి ఎన్నికలు వచ్చి ప్రజాధనం వృథాకు కారకుడు కాదా అని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆయన రెండు చోట్ల గెలిస్తే ఏ స్థానం వదులు కుంటారో ముందుగానే స్పష్టం చేసి ఓటు అడగాలి అన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. నెటిజన్ల డిమాండ్లపై గబ్బర్ సింగ్ ఎలా స్పందిస్తారో చూడాలి.