అప్పుడు వద్దన్నాను.. ఇప్పుడు ఎక్కువ సంతానాన్ని కనాలంటున్నా: చంద్రబాబు
జనాభా తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ కూడా జపాన్లా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత దేశంలోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉందని గుర్తుచేశారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందర
విజయవాడ: జనాభా తగ్గిపోతే ఆంధ్రప్రదేశ్ కూడా జపాన్లా మారిపోతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచ దేశాలతో పోల్చితే భారత దేశంలోనే కుటుంబ వ్యవస్థ బలంగా ఉందని గుర్తుచేశారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిమీద ఉందన్నారు.
ఒకప్పుడు జనాభా పెరగవద్దని తానే కోరానని, ఇప్పుడు తానే ఎక్కువ సంతానాన్ని కనాలని ప్రోత్సహిస్తున్నానని చెప్పారు. రామినేని ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. నమ్మిన సిద్ధాంతాలకోసం నిజాయితీతో పనిచేసేవారికి రామినేని ఫౌండేషన్ అవార్డులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
ఈ సందర్భంగా అవార్డు అందుకున్న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కెవి చౌదరిని అభినందించారు. ఆయన నిజాయితీకి నిలువుటద్దం లాంటి వారని ప్రశంసించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించిన సీఎం.. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు క్రమశిక్షణ, నిజాయితీతో నడుచుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
హెచ్సీయూ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డీన్ గీతా కె వేముగంటి, సురభీ రంగస్థల కళాకారులు ఆర్.నాగేశ్వరరావు, ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తికి కార్యక్రమంలో విశేష పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతోపాటు గోవా సీఎం మనోహర్ పారికర్, పలువురు ఏపీ మంత్రులు పాల్గొన్నారు.