పరిస్థితులను బట్టి సంయమనం పాటిస్తున్నాం.. ప్రజా సమస్యలు పట్టించుకోక పోతే తాట తీస్తామన్న పవన్ కళ్యాణ్
అమరావతి/హైదరాబాద్ : ప్రజలెదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, కరోనా వైరస్ క్లిష్ట సమయంలో సంయమనం పాటించి సున్నితంగా స్పందిస్తున్నామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రైతులు, కూలీలు, ఆటో కార్మికుల సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, జనసైనికులు పెద్ద మనసుతో చేస్తున్న సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అంతే కాకుండా గుంటూరు, కృష్ణా జిల్లాల నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన పవస్ కళ్యాణ్ కరోనా క్లిష్ట సమయంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం అంతాగా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత గురించి ఆలోచించండి: తెలుగు రాష్ట్రాలకు పవన్ కళ్యాణ్
లాక్ డౌన్ ఆంక్షల సమయం.. ప్రజల సమస్యలను తెలుసుకోలేపోతున్న ప్రభుత్వమన్న పవన్..
తన జీవితంలో ఎన్నడూ ఊహించని విపత్తుని ఎదుర్కొంటున్నామని, ఈ కష్ట సమయంలో ప్రజలకు అండగా నిలిచి, మనో ధైర్యాన్ని ఇవ్వాలనే బాధ్యతతో జనసేన నాయకులు, కార్యకర్తలు పని చేస్తున్నారని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ స్పష్టం చేసారు. కరోనా మూలంగా తలెత్తిన పరిస్థితుల్లో ప్రభుత్వం పని తీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొంటున్నామని తెలిపారు. ఈ తరుణంలో వీలైనంత మేరకు ప్రజలకు అవసరమైన సాయం చేయడమే ముఖ్యమని, అందుకే రాజకీయాలకు తావు లేకుండా సంయమనంతో సున్నితంగా స్పందిస్తున్నామన్నారు కాటమరాయుడు. గుంటూరు, కృష్ణా జిల్లాల జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వ్యాధి మూలంగా తలెత్తిన పరిస్థితులు, లాక్ డౌన్ అమలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్షించారు.
జనసేన నేతలతో పవన్ టెలీ కాన్ఫరెన్స్.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని తెలుసుకున్న గబ్బర్ సింగ్..
పవన్ కళ్యాణ్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. కరోనా విపత్తు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పకుండా ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, అలాగే రాష్ట్రంలో పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతాంగం, కూలీలు ఎదుర్కొంటున్న సమస్యలను జనసైనికుల ద్వారా తెలుసుకున్నానని, భవన నిర్మాణ కార్మికులు ఉపాధికి దూరమయ్యారని, ఆటోమొబైల్ రంగం కూడా ఇబ్బందుల్లో ఉందని, ఆ రంగం మీద ఆధారపడ్డ కార్మికులు ఆర్థిక కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం ఆ రంగాల వారిని ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.
మానవత్వం బతికే ఉందని నిరూపిస్తున్నారు.. జనసేన శ్రేణులను ప్రశంసిన పవన్..
ప్రపంచం ఎవరూ ఊహించని పరిణామం చోటుచేసుంకుందని, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని, పేద ప్రజలు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారని, వారికి అండగా ఉంటూ మానవత్వం బతికే ఉందని జన సైనికులు తమ సేవా కార్యక్రమాలతో నిరూపిస్తున్నారని పవన్ తెలిపారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పరిస్థితి తీవ్రంగా ఉందని, గుంటూరు, విజయవాడ నగరాల్లో రెడ్ జోన్లు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు. అలాగే నరసరావుపేట, పొన్నూరుల్లోనూ రెడ్ జోన్స్ ఏర్పటు చేసారని, కరోనా వ్యాధి తీవ్రతపై ప్రభుత్వం తగిన రీతిలో సత్వరం స్పందించనందున ఈ విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
క్లిష్ట సమయంలో రాజకీయాలొద్దు.. ప్రజల కష్టాల పట్ల ప్రభుత్వం స్పందించాలన్న జనసేనాని..
అంతేకాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి, వృద్ధులకు.. అత్యవసర ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణం స్పందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కళ్యాణ్. మైలవరం ప్రాంతంలో మల్లె తోటలు వేసిన రైతులు మార్కెటింగ్ అవకాశం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, వరి రైతుకు కనీస మద్దతు ధర కూడా దక్కకపోడం శోచనీయమని పవన్ తెలిపారు. పేద ప్రజలకు ఇచ్చే ఆర్థిక సాయం సక్రమంగా అందకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకోవడంతో రోజు కూలీలు, హాకర్లు, ఆటో డ్రైవర్లు, తదితరులు కాల్ మనీ రాకెట్లో చిక్కుకొంటున్న పరిస్థితిని ప్రభుత్వానికి వివరిస్తానన్నారు పవన్ కళ్యాణ్. కరోనా క్లిష్ట సమయం నుండి కాస్త వెలుసుబాటు కలగగానే కార్యాచరణ రూపొందిస్తానని పవన్ కళ్యాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.