రాహుల్ ప్రధాని అయితే చంద్రబాబు కేంద్ర మంత్రి అవుతారట ... వైసీపీ నేత దాడి కామెంట్స్
ఏపీలో ఎన్నికలు ముగిసినా నేతల విమర్శలు జోరుగా కొనసాగుతున్నాయి. సంచలనాలు, ఆసక్తికర వ్యాఖ్యలతో ఏపీ రాజకీయం రసవత్తరంగా మారింది .ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఆయన కేబినేట్ లో కేంద్ర మంత్రి అవుదామని చంద్రబాబు నాయుడు తాపత్రాయపడుతున్నారంటూ ఆసక్తికర విమర్శ చేశారు దాడి వీరభద్రరావు .
జగన్ది అనవసరపు ఆయాసం: బాబాయ్ని చంపి అరాచకం :సీఈసీ ఫోజులు కొడుతున్నాడు : బాబు ఫైర్..!
విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన దాడి తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదట నుండి టీడీపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్ తో జత కట్టి టీడీపీ ని నాశనం చేసింది చంద్రబాబే నని దాడి తన మాటలతో చంద్రబాబుపై దాడి చేశారు. రాహుల్ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రమంత్రి అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదన్నారు.
రాష్ట్రంలో అత్యధిక సార్లు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించింది చంద్రబాబు నాయుడేనంటూ ఆయన ఆరోపించారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబుని కొనసాగించడం సరికాదన్నారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని చంద్రబాబును సీఎంగా తొలగించాలని డిమాండ్ చేశారు దాడి వీరభద్రరావు. మొత్తానికి ఏపీలో అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీల నేతల మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అందరి టార్గెట్ చంద్రబాబే అన్న చందంగా ఏపీలో పరిస్థితి తయారైంది .