రాయలసీమకు హైకోర్టు వస్తే పది జిరాక్స్ షాపులు పెరగటం తప్ప ఏం లాభం : జేసీ దివాకర్ రెడ్డి
జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మావాడు మహా తెలివైనవాడు అంటూనే , తల ఒక చోట మొండెం ఒక చోట, కాళ్ళు చేతులు ఇంకో చోట పెట్టాలని చూస్తున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డికి చురకలు అంటించారు. రాయలసీమకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేది ఏమీ లేదని విమర్శలు గుప్పించారు టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి .
రాజధాని మార్పు వైసీపీ నేతలు చెప్పేంత సులభమైన అంశం కాదని, ఇప్పటికే హైదరాబాద్ నుండి వచ్చేసినందుకు ఏడుస్తున్నామని పేర్కొన్నారు. రాయలసీమలో హైకోర్టు పెడితే మహా అయితే ఓ 10 జిరాక్స్ షాపులు అదనంగా వస్తాయని అంతకు మించి రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని అన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని చెప్పారు.విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు. ఇప్పటికే ఇబ్బందిగా ఉందని, వైజాగ్ కు మారిస్తే అసలు వెళ్ళే పరిస్థితి ఉండదని చెప్పారు.
అలాంటి పరిస్థితి వస్తే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వాలని, అందుకోసం ఉద్యమాలు చేస్తామని జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు. ఇక గత ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తాత్కాలికం, తాత్కాలికం అంటూ పిచ్చి పని చేశారని దివాకర్ రెడ్డి అన్నారు. అమరావతిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు అలా చెప్పారని వివరించారు. రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని జేసీ హెచ్చరించారు. అలా చెయ్యటానికి వీల్లేదని పేర్కొన్నారు .రాజధానిని కావాలంటే కడపలోనో, పులివెందులలోనో పెట్టుకోమని చెప్పారు. కేవలం హైకోర్టు తో రాయలసీమ వాసులకు ఒరిగేది ఏమీ లేదని ఆయన చెప్పారు.