పార్టీలోకి కోవర్టులను పంపిస్తే తాట తీస్తా..! మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న గబ్బర్ సింగ్..!!
రాజమహేంద్రవరం/హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి మండిపడ్డారు. పార్టీ అంతర్గత సమాచారం కోసం కుయుక్తులు పన్నితే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చారు గబ్బర్ సింగ్. మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీల తరపున కోవర్టులను పంపిస్తే సహించేది లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఇవి 2009, 2014 ఎన్నికలు కావని 2019 ఎన్నికలని గుర్తుంచుకోవాలని అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ ఎన్నికల్లో ఓడిపోతారని పవన్ జోస్యం చెప్పారు.
గోదావరి పుష్కరాల నిధులను కూడా కొందరు దోచేశారని, దేవుడి సొమ్మును కూడా స్వాహా చేసే కక్కుర్తి ఎందుకని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ఎన్నికల శంఖారావ సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. సచార్ కమిటీ సిఫార్సులు అమలు చేసేలా ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు. ఎందరో నేతలు రాజకీయాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నారని అన్నారు. సీఎం అని అరవకుండా అంతా జనసేనకు ఓటేయించాలని పవన్ కోరారు. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత జాతీయ పార్టీ బీఎస్పీనే అని పవన్ అభిప్రాయపడ్డారు.