ఆమె గెలిస్తే పార్టీ ఓడిపోతుందట..! పార్టీ గెలావాలంటే ఆమె ఓడిపోవాలట..! వైసీపిలో వింత సెంటిమెంట్!!
హైదరాబాద్ : వైయస్ఆర్సీపి లో ఫైర్ బ్రాండ్ గా ముద్రవేసుకున్న నగరి ఎమ్ఎల్యే ఆర్కే రోజా పరిస్థితి విచిత్రంగా తయారయింది.ఈ సారి తన టికెట్ విషయంలో నీల నీడలు కమ్ముకోబోతున్నట్టు తెలుస్తోంది. స్థానిక నేతల ఆరోపణలు రోజా అంశంలో శరాఘాతంలా పరిణమిస్తున్నాయి. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ కేటాయిస్తే పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో సెంట్ మెంట్ జోడించి మరి లెక్కలు వేస్తున్నారు. ఈ లెక్కలన్నీ పార్లీ అదినేత జగన్మోహన్ రెడ్డి కి అర్థమయితే రోజా టికెట్ పై కారుచీకట్లు అలుముకున్నట్లే ననే చర్చ జరుగుతోంది. ఇంతకీ రోజా విషయంలో స్థానిక నేతలు చెప్పకొస్తున్న సెంటిమెంట్ లెక్కలేంటి..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
రోజాకు సెంటిమెంట్ సెగలు..! నగరి సీటు డౌటే..!!
ఏపీలోని చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గం నుంచి తిరిగి పోటీ చేయాలనుకుంటున్న వైకాపా ఎమ్మెల్యే రోజాను సెంటిమెంట్ సెగలు చుట్టుముడుతున్నాయి. ఆమె తిరిగి ఆ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆమెకు పోటీ చేసే అవకాశాన్ని ‘జగన్' కల్పించకపోవచ్చని స్థానిక నేతలు అంటున్నారు. ఆమెకు ఎదురైన సెంటిమెంట్ కారణంగా తిరిగి ఆమెను యంఎల్యే చేసే పరిస్థితులు లేవని స్థానిక నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. ఈ సెంటిమెంట్ రహస్యం ఏమిటనేది కూడా వారు వివరిస్తున్నారు. గతంలో రోజా రెండు సార్లు ఇక్కడి నుంచి టిడిపి తరపున పోటీ చేసి ఓడిపోవడంతో ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. అయితే మూడోసారి నగరి నుంచి ఆమె పోటీ చేసి నామమాత్రపు విజయం సాధించారు.
రోజా గెలిస్తే పార్టీ అదికారంలోకి రాదట..! జగన్ కు స్థానికుల సెంటిమెంట్ ఫిర్యాదు..!!
అయితే అప్పుడు కూడా వైకాపా అధికారంలోకి రాలేకపోయింది. ఆమెకు తిరిగి నగరి సీటు కేటాఇస్తే, ఒకవేళ ఆమె గెలిస్తే, అప్పుడు వైకాపా అధికారంలోకి రాదని స్థానిక నేతలు సెంటిమెంటు జోడించి మరి చెబుతున్నారు. అందుకే ఆమెకు నగరి నియోజకవర్గం టిక్కెట్టు ఇవ్వడం జగన్ కు మంచిది కాదని సూచిస్తున్నారు. కాగా ప్రజారాజ్యం వల్లే తాను రెండు సార్లు ఓడిపోయానని రోజా చెబుతుంటారు. అలాగే 2014 ఎన్నికల్లో గాలిమద్దు కృష్ణమనాయుడును ఎదుర్కొని తాను విజయం సాధించిన విషయాన్ని మరిచిపోయారని ఆమె వాపోతున్నట్టు తెలుస్తోంది.
రాజకీయాల్లో సెంటిమెంట్ ఏంటి..? భగ్గుమంటున్న రోజా..!!
దీనికితోడు 2014 ఎన్నికల్లో పలువురు వైకాపా నేతలు విజయం సాధిస్తారని పార్టీ అధినేత జగన్భావించినప్పటికీ అందులో కొందరు ఓడిపోయిన విషయాన్ని రోజా గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటువంటి సెంటిమెట్లతో తనకు టిక్కెట్ ఇవ్వకుండా అడ్డుకునేందుకు కొంత మంది స్థానిక నేతలు కుట్రపన్నుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు, దీనికి తోడు రాష్ట్ర స్థాయి నాయకులు సైతం ఇటువంటి ప్రచారాలు సాగిస్తున్నారని రోజా మండిపడుతున్నారని సమాచారం. మరోవైపు రోజా జనసేన అధినే పవన్ సోదరుడు నాగబాబు సహాయంతో ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారనే వార్తలు వినిపించాయి. అయితే ఆమె ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు.
వైసీపి టికెట్ ఇవ్వకపోతే పార్టీ వీడేందుకు రెఢీ..! జనసేనలో సీటు ఖరారు చేసుకున్న రోజా..!!
అయితే నగరి నుంచి ఆమెకు వైకాపా తరపున టిక్కెట్ లభించకపోతే ఆమె జనసేనలో చేరడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్యే రోజా షూటింగ్ల పేరుతో అధిక సమయాన్ని చెన్నై, హైదరాబాద్లలో గడుపుతున్నారని ఆమె వ్యతిరేక వర్గీయులు పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రోజాకు ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉన్నాకూడా, నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతో ఆమెపై పార్టీలోని కొంత మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రోజాకు నగరి టిక్కెట్ దక్కడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి నగరి సీటు విశయంలో రోజాకు జగన్ వేటు వేస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.