ఆ అంచనా నిజమైతే ఏపీలో అదికారం కాంగ్రెస్ దే..!!
Recommended Video
పోయిన చోటే వెతుక్కోవాలని అన్న నానుడి ఎప్పుడు, ఎక్కడ, ఎవరి ద్వారా పుట్టిందో గాని ఇప్పుడు ఏపి కాంగ్రెస్ కి అతికినట్టు సరిపోయింది. రాజకీయంగా ఎవరెస్టు శిఖరం అంత ఎత్తు ఎదిగిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అగాదంలో పడినంత పని అయ్యింది. హీరోలుగా చలామని అవుతున్న కాంగ్రెస్ నాయకులు ఉన్నట్టుండి జీరోలుగా మారిపోయారు. ఏపి ప్రజల ద్రుష్టిలో విలన్ ముద్ర వేసుకున్న కాంగ్రెస్ పార్టీని ఆ అపోహ నుండి బయటపడేసేందుకు నాయకులు కసరత్తు మొదలు పెట్టారు. రాష్ట్ర విభజనతో గాయపడ్డ ఏపి ప్రజల మనోభావాలకు అదే విభజన హామీలతో చికిత్సచేసి చేసిన తప్పును సరిదిద్దుకోవాలని యోచిస్తోంది. అందుకోసం విభజన సమయంలో అదిష్టానానికి వ్యతిరేకంగా గళం విప్పి, ప్రజల పక్షాన నిలిచిన నేతలకు కాంగ్రెస్ ఆహ్వానం పలుకుతోంది.
ఏపి లో కాంగ్రెస్ పూర్వవైభవం సాదించేనా..
ఏఐసీసీ అద్యక్షుడు రాహుల్ గాంధీ వ్యూహాలకు తోడు, ఏపి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ అపార అనుభవం ఏపిలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ప్రజల మనోభావాలకు అనుకూలంగా వ్యవహరించిన నాయకుల ద్వారా ఏపి కి జరిగిన నష్టాన్ని ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే భర్తి చేయగలుగుతుందనే సంకేతాలను పంపాలనుకుంటోంది. విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను బీజెపి ప్రభుత్వం ఎందుకు నెరవేర్చలేదో అనే అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ.
విభజన గాయాలకు హామీల అమలు తో చికిత్సచేయాలనుకుంటున్న అదిష్టానం..
విభజన ద్వారా జరిగిన నష్టానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేయగలదనే వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఆనాడు విభజనకు వ్యతిరేకంగా పని చేసిన నాయకుల చేత చెప్పించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ అదిష్టానం. అదిస్టానం నిర్ణయాన్ని బహాటంగా వ్యతిరేకించిన నాయకులను ఏపి ప్రజలు ఆదరించే అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ అదిష్టానం ఆ దిశగా పావులు కదిపేందుకు ప్రణాళిక రచిస్తోంది. అందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించి ఏపిలో పార్టీకి జీవం పోయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఏపిలో పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు ఇలాంటి నేతల పునరాగమనం ఎంతగానో తోడ్పడుతుందని అదిష్టానం అంచనా వేస్తోంది.
విభజనకు వ్యతిరేకంగా గళం విప్పిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేతలను ఏపి ప్రజలు స్వాగతిస్తారా..
అంతే కాకుండా నాలుగేళ్లుగా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి కేంద్ర బీజెపి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేసిందనే అంశాలపైన ద్రుష్టి సారిస్తోంది కాంగ్రెస్ పార్టీ. విభజన హామీల అమలులో బీజెపి, టీడిపి మద్య ఏర్పడిన గ్యాప్ లో కాంగ్రెస్ పార్టీ చొచ్చుకు పోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఆంద్ర ప్రదేశ్ కి విభజన హామీలను అమలు చేసే చిత్త శుద్ది ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందనే నమ్మకాన్ని ఏపి ప్రజలకు కల్పించేందుకు సిద్దపడుతున్నారు కాంగ్రెస్ నాయకులు. వచ్చే ఎన్నికల్లో విభజన హామీల అమలులో భాగంగా ప్రత్యేక హోదా కోసం కాం గ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనే నినాదంతో ప్రజలమద్యకు వెళ్లాలని కాంగ్రెస్ బావిస్తోంది. అందుకోసం కిరణ్ కుమార్ రెడ్డితో బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయించి ప్రసంగాలు ఇప్పించాలని కాంగ్రెస్ అదిష్టానం పావులు కదుపుతోంది.
ఏపిలో కిరణ్ కేమార్ రెడ్డి చేరికతో బలం పుంజుకున్న కాంగ్రెస్..
కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడంలో చూపించిన అలసత్వం, హామీలను అమలు చేయించుకోవడంలో టీడిపి ప్రబుత్వం విఫలం చెందిని విధానాలను ప్రజలకు కూలంకషంగా వివరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. విభజన అంశంలో కేంద్రంతో విభేదించిన నాయకులను మరికొంత మందిని పార్టీలో చేర్చుకుని ఏపి కి జరిగిన అన్యాయానికి సరైన న్యాయం చేసేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ననే నమ్మకాన్ని కలిగించాలని కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ అదిష్టానం ప్రణాళికను ఏపి ప్రజలు అర్థం చేసుకుని., విభజన హామీలు అమలు చేయగల పార్టీ ఒక్క కాంగ్రెస్ మాత్రమే ననే అంచనాకు వస్తే మాత్రం రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అదికారం చేజిక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.