టిడిపి అధికారంలోకి రాకపోతే...రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది:చంద్రబాబు
విజయవాడ:టిడిపి మహానాడు రెండో రోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టిడిపి మళ్లీ అధికారంలోకి రాకపోతే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయని...అభివృద్ధి పూర్తిగా కుంటుపడి...రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుందని చంద్రబాబు చెప్పారు.
అందుకే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ రావాలని...ఇది చారిత్రక అవసరమని...లేకుంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుందని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.అలాగే తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని...అందువల్ల ఆయనకు 'భారతరత్న' ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
టిడిపి రాకపోతే...అధోగతే...
మహానాడు రెండో రోజు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారో ఆయన మాటల్లోనే...""ఒకటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోతాయి. వందల కోట్ల రూపాయల పనులు నిలిచిపోతాయి. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోతుంది. రాష్ట్రం 20ఏళ్లు వెనక్కి వెళ్లిపోతుంది...అందుకే ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ టీడీపీ రావాలి. ఇది చారిత్రక అవసరం. లేదంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. తెలుగు తమ్ముళ్లంతా మరో ఏడాది కష్టపడాలి. టీడీపీ శ్రేణులన్నీ ఎన్నికలకు సిద్ధంకండి. మన పార్టీ తిరిగి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించండి."...ఇవీ మహానాడు రెండోరోజు సమావేశాల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో కొన్ని..
ఎన్టీఆర్ కు...భారతరత్న
తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని...అలాంటి మహానుభావుడికి ‘భారతరత్న' ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా డిమాండ్ చేశారు. రెండోరోజు మహానాడులో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అన్నింటా అగ్రభాగాన నిలిపినప్పుడే ఎన్టీఆర్కు అసలైన నివాళి అని అన్నారు. ఎపి రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ మెమోరియల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. తెలుగువాళ్లందరూ స్ఫూర్తి పొందేలా ఎన్టీఆర్ బయోపిక్ ఉటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
పార్టీకి సమయం...కేటాయిస్తా
భవిష్యత్లో ఎక్కువ సమయం పార్టీ కార్యకర్తలకు కేటాయిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాయకులంతా ఒకేలా ఉండరని...కొందరు పనిచేస్తూ కూడా పేరు తెచ్చుకోలేరని, మరికొందరు నియోజకవర్గంలో లేకపోయినా పనులు చేస్తుంటారని చెప్పారు. అయితే అందరూ విభేదాలు మాని కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. పార్టీ ఏం చేసిందని కాదు...పార్టీకి ఏం చేశామో ఆలోచించండని చంద్రబాబు పార్టీ శ్రేణలకు హితవు పలికారు. ఏపీ ఇమేజ్ను వైఎస్ దారుణంగా దెబ్బతీశారని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వైఎస్ అవినీతి వల్ల పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్లు జైలుకెళ్లారని, వైఎస్ కుమారుడు జగన్ అతిపెద్ద అవినీతి పరుడని, కేంద్రం అవినీతిపరులతో చేతులు కలిపిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే టిడిపి హయాంలో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి
చంద్రబాబు వ్యాఖ్యలపై...భిన్నాభిప్రాయాలు
అయితే మహానాడు రెండో రోజు సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పరిశీలకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ది గురించి చెప్పుకోవడంలో తప్పు లేదని, కానీ మళ్లీ టిడిపి రాకుంటే రాష్ట్రం పరిస్థితి అదోగతే నని చంద్రబాబు వ్యాఖ్యానించడం సరికాదంటున్నారు. ఈ విధమైన వ్యాఖ్యలు ప్రజల్ని బెదిరించినట్లుగా ఉన్నాయని, దానివల్ల అంతిమంగా పార్టీకి నష్టమే జరుగుతుంది తప్ప మేలు జరగదని వారు విశ్లేషిస్తున్నారు. పైగా చంద్రబాబుకు గెలుపుపై, తాను చేసిన అభివృద్దిపై నమ్మకం లేకే ఈ విధంగా మాట్లాడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతుండటం గమనార్హం.