కాంగ్రెస్తో టీడీపీ కలిస్తే...ఉరి వేసుకుంటా:డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
కర్నూలు:కాంగ్రెస్-టిడిపి పొత్తుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో టీడీపీ కలిసే ప్రసక్తే లేదని...ఇది పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. ఒకవేళ అదే జరిగితే తాను ఉరి వేసుకుంటానని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సవాల్ విసిరారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన కెఈ కృష్ణమూర్తి బిజెపి-వైసిపిలపై విమర్శల వర్షం కురిపించారు. వైసీపీ నాటకాలు ఆడుతోందని ప్రజలకు తెలిసిపోయిందన్నారు. బీజేపీ పంచన చేరిన వైసీపీకి 2019లో పుట్టగతులు ఉండవని కేఈ అన్నారు. మరోవైపు గల్లా అరుణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె తనయుడు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొట్టిపారేశారు. తన తల్లి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అన్నారు.
కాంగ్రెస్ తో పొత్తు ఉండదు:కేఈ
బుధవారం మీడియాతో మాట్లాడుతూ టిడిపి-కాంగ్రెస్ పొత్తు విషయంపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సంచలన వ్యాఖ్యలు. కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకోవడం కల్ల అని ...ఇది టిడిపి పార్టీ నిర్ణయమని స్పష్టం చేశారు. అయితే కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా టిడిపి-కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం అనేది జరిగితే...అదే జరిగితే తాను ఉరి వేసుకుంటానని కేఈ కృష్ణమూర్తి ఛాలెంజ్ చేశారు. వైసిపి బీజేపీతో రహస్య ఒప్పందం చేసుకుని కుప్పిగంతులు వేస్తుందని ధ్వజమెత్తారు. టీడీపీని విమర్శించాలని జగన్, పవన్ అదే పనిగా పెట్టుకున్నారని అన్నారు
క్లైమాక్స్ కు...రాజీనామాల డ్రామా
వైసిపి ఎంపీల రాజీనామా వ్యవహారంపై ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల డ్రామా ఎట్టకేలకు క్లైమాక్స్కు చేరిందన్నారు. బీజేపీ, వైసీపీ కలిసి ఆడిన ఈ రాజీనామాల డ్రామా ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని అన్నారు. ఉప ఎన్నికలు రావని తేలిసే వైసీపీ ఎంపీలు రాజీనామా డ్రామాలాడారని మంత్రి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలంటేనే వైసీపీకి భయమని మంత్రి యనమల అన్నారు.
Recommended Video
జేసీ వ్యాఖ్యలు:ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కౌంటర్
"సిట్టింగ్లపై ప్రజావ్యతిరేకత ఉంది....జిల్లాలో వారికే టికెట్లు ఇస్తే ముగ్గురు, నలుగురే గెలుస్తారు"...అంటూ ఇటీవల ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్చౌదరి ఘాటుగా ప్రతిస్పందించారు. ఎవరో పేపర్లో రాసుకుని వెళ్లి చూపిస్తే టికెట్లు ఇవ్వరని... గెలిచే ఆ ముగ్గురు నలుగురెవరో వారితోనే చెప్పించుకోవాలన్నారు. అన్ని పార్టీలు మారినవారెవరో ఆయన్నే అడగండి. నేను ముందు కాంగ్రెస్లో ఉంటూ టీడీపీలోకి వచ్చాను. ఇక్కడ కొన్ని విభేదాల వల్ల అప్పట్లో ప్రజారాజ్యంలో పనిచేశాం. అయితే అక్కడ సభ్యత్వం కూడా తీసుకోలేదు. అయినా టికెట్ల కేటాయింపులో హైకమాండ్దే తుది నిర్ణయం. సీఎం కూడా ప్రజామోదం ఎవరికి ఉందో అన్ని రకాలుగా సర్వే చేయించుకుని టికెట్లు కేటాయిస్తారు.
ఆ వార్తలు అవాస్తవం:ఎంపి గల్లా
సీనియర్ నాయకురాలు గల్లా అరుణ పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె తనయుడు,గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొట్టిపారేశారు. తన తల్లి పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం అవాస్తవం అన్నారు. గల్లా అరుణ అమెరికా వెళ్లే ముందు రాబోయే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయనని చెప్పారన్నారు. దీనికి లేనిపోని ప్రచారాలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామాగా అభివర్ణించారు. సాధారణ ఎన్నికలకు ఏడాదిలోపు ఉపఎన్నికలు రావని తెలిసే రాజీనామా చేశారని తెలిపారు.