ఒక్కటి నిరూపిస్తే మీ పార్టీలో చేరతా:టిడిపికి వైసిపి ఎమ్మెల్యే ఛాలెంజ్
నెల్లూరు:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను దారుణంగా మోసగించాయని వైసిపి నేతలు ధ్వజం ఎత్తారు. నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం జరిగిన వంచన గర్జన దీక్షలో రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వం...కేంద్రంలోని బిజెపి గవర్నమెంట్ పై వైఎస్ఆర్ నేతలు విమర్శల వర్షం కురిపించారు.
Recommended Video
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వ్యవహరించిన వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దా నాలలో రైతు రుణమాఫీతో సహా పొదుపు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు పక్కా గృహాలు...వీటిలో ఏ ఒక్కటైనా పూర్తిగా అమలు చేసి ఉంటే తాను వైసీపీకి రాజీనామా చేసి ఆ క్షణమే టీడీపీలో చేరుతానని సవాలు విసిరారు.
వైసిపి...వంచన గర్జన దీక్ష
నెల్లూరులోని వీఆర్ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం వైసీపీ నేతలు బీజేపీ, టీడీపీ వంచనపై గర్జన దీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరోవైపు ఈ కార్యక్రమానికి జనాలు కూడా భారీ సంఖ్యలో హాజరుకావడం వైసిపి నేతల్లో మరింత జోష్ నింపింది. ఇక నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించారు.
టిడిపి-బిజెపి...మోసం,దగా
ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన 600 వాగ్దా నాల్లో ఒక్కటీ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు సిగ్గులేకుండా ధర్మదీక్షలు చేస్తున్న నయవంచకుడు చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పటం ఖాయమన్నారు. కడప ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల అనుభవం ఉందని చెబుతున్న సీఎం ఎందుకు ప్రత్యేక హోదా సాధించలేకపోయారని ప్రశ్నించారు. వైసిపి ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రజలను మోసగించడంలో నెంబర్ వన్ ముద్దాయిగా మోదీ, నెంబర్ టు ముద్దాయిగా చంద్రబాబు నిలిచారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది వైసీపీయేనన్నారు.
నిరూపిస్తే...టీడీపీలో చేరుతా
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దా నాలకు సంబంధించి రైతు రుణమాఫీ, పొదుపు రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, పేదలకు పక్కా గృహాలు, ఏ ఒక్కటైనా పూర్తిగా అమలు చేసి ఉంటే తాను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతానన్నారు. వైసిపి అధినేత జగన్ ను ఉద్దేశించి జేసీ సోదరులు మాట్లాడుతున్న తీరు సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో జెసి బ్రదర్స్ ప్రజలు సరైన బుద్ది చెబుతారన్నారు. ప్రజలు ఆ సమయం కోసమే వేచి చూస్తున్నారని చెప్పారు.
వైసిపికి...సినీకళ...అస్వస్థత
వంచన గర్జన సభకు హాజరైన సినీ నటులు పృథ్వీ, విజయ్చందర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న వంచన గురించి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ చైతన్యం చేస్తున్నామన్నారు. సినీ రంగానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు ఇప్పటికే జగన్కు బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను అక్రమంగా కొనుగోలు చేసిన చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మరోవైపు వంచన గర్జన దీక్షలో ప్రసంగించి వేదికపై ఉన్న సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఒక్కసారిగా అస్వస్థతకు గురవడంతో ఆందోళన నెలకొంది. దీంతో ఆయన్ను నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు తరలించారు. డీహైడ్రేషన్తో నీరసించిపోయి కళ్లు తిరిగినట్లు వైద్యవర్గాలు తెలిపాయని, ఆదివారం డిశ్చార్జ్ చేస్తారని ఉమ్మారెడ్డి అల్లుడు,వైసిపి నేత కిలారి రోశయ్య తెలిపారు.