నా పాలన నచ్చకపోతే పెన్షన్లు తీసుకోవద్దు, రోడ్లపై నడవద్దు: బాబు షాకింగ్ కామెంట్స్
తనకు ఓట్లకు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఓట్లతో సంబంధం లేకుండా అందరిని సమదృష్టితో చూడాల్సిందిపోయి..
నంద్యాల: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నంద్యాలలో షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాలన నచ్చకపోతే.. తానిచ్చే పెన్షన్స్ తీసుకోవద్దని, తాను వేసిన రోడ్ల మీద నడవద్దని నిప్పులు చెరిగారు. తానిచ్చే పెన్షన్ తీసుకుంటూ.. తాను వేసిన రోడ్డు మీదే నడుస్తూ.. తనకే ఓటు వేయనంటే ఎలా? అని ప్రశ్నించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సందర్బంగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కొంతమంది అవినీతి డబ్బును ఖర్చు పెడుతున్నారని పరోక్షంగా వైసీపీని ఆయన టార్గెట్ చేశారు. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో గెలిచి.. గెలిచిన తర్వాత అంతకు రెట్టింపు డబ్బు వెనకేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికల వేళ.. తాను కూడా ఒక్కో ఓటుకు రూ.5వేలు ఇవ్వగలనని, కానీ అలాంటి అవినీతికి తాను దూరమని చంద్రబాబు అన్నారు.
అంతేకాదు, తనకు ఓట్లకు వేయని గ్రామాలను అవసరమైతే పక్కన పెడతానని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో ఓట్లతో సంబంధం లేకుండా అందరిని సమదృష్టితో చూడాల్సిందిపోయి.. ఓట్లు వేయకపోతే పక్కనపెట్టేస్తామని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.