ఉత్తరాంధ్ర, రాయలసీమ టీడీపీ నేతలు రాజీనామా చేసి రాజధానిపై మాట్లాడండి: విడుదల రజనీ
రాజధాని మార్పుపై ఊహాగానాలు పీక్ స్టేజీకి చేరిన నేపథ్యంలో.. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతల మధ్య మాటలయుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. రాజధాని మార్పుపై జీఎన్ రావు కమిటీ సిఫారసుతో ఏపీ భగ్గమంటోంది. ఇంతలో కొందరు టీడీపీ నేతలు.. వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వైసీపీ ఎమ్యెల్యే విడుదల రజనీ తీవ్రంగా స్పందించారు. మేం కాదు రాజీనామా చేయాల్సింది మీరేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సభా పర్వం : మహిళల భద్రత కోసం ఏం చేశారు? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు అంటూ విడదల రజనీ ఫైర్
మేం కాదు.. మీరే...
ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన టీడీపీ నేతలు రాజీనామా చేయాలని విడుదల రజనీ డిమాండ్ చేశారు. తిరిగి ఎన్నికైతే రాజధాని అమరావతిలో ఉండాలని కోరాలని చెప్పారు. అంతేకానీ తమను రాజీనామా చేయాలని కోరడం సరికాదన్నారు. దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. అంతేకానీ ఇంట్లో కూర్చొని మాట్లాడటం కాదు, రోడ్డు మీదికి రావాలని సూచించారు.
అంతా మీరే చేశారు
అమరావతి రైతుల దుస్ధితికి చంద్రబాబే కారణమని విడుదల రజనీ ఆరోపించారు. వారిని కన్ఫ్యూజ్ చేస్తోంది ముమ్మాటికీ చంద్రబాబేనని పేర్కొన్నారు. రాజధాని మార్పుపై ప్రభుత్వం కమిటీ వేసిందని, నివేదికపై ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని రజనీ పేర్కొన్నారు. కానీ టీడీపీ నేతలు దొంగ దొంగ అని భుజాలు తరుముకున్నట్టు చేస్తున్నారని మండిపడ్డారు.
రైతులపై ప్రేమ కాదు
అమరావతి రాజధాని మార్పు గురించి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు రైతులపై ప్రేమ లేదన్నారు. వారంతా ఇక్కడే భూములు కొనుగోలు చేశారని, తమ భూములకు ఎక్కడ ధర రాదని తెలిసి భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. అక్రమ సొమ్ముతో కొనుగోలు చేసిన భూములకు ధర తగ్గిపోతుందనే భయం వారిని నీడాలా వెంటాడుతుందని చెప్పారు. ఇదీ టీడీపీ నేతల భాగోతం అని విడుదల రజనీ ధ్వజమెత్తారు.
ప్రగతిబాటలో పయనం
రాజధానికి సంబంధించి తమ ప్రభుత్వం ప్రజల మేలు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పారు. అందరీ బాగుకోసం ముందడుగు వేయబోతుందని తెలిపారు. జగన్ నేతృత్వంలో రాష్ట్రం ప్రగతి బాటలో పయనిస్తోందని చెప్పారు.