జాబు రావాలంటే బాబు పోవాలి : పంచాయతీల్లో యువతకు కొలువు ? వీరు ఏం చేస్తారంటే ?
నందికొట్కూరు : ఏపీ ప్రచార హీట్ పీక్ స్టేజీకి చేరిపోయింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతల వరాలజల్లు కురిపిస్తున్నారు. ఇవాళ కర్నూలు జిల్లా నందికొట్కూరు ప్రచారంతో జగన్ క్యాంపెయిన్ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు లక్ష్యంగా జగన్ విమర్శలు చేశారు.
పంచాయతీల్లో కొలువులు
వైసీపీ అధికారంలోకి వస్తే యువతకు అందించే ఉద్యోగవాకాశాల గురించి వివరించారు జగన్. గ్రామ సచివాలయంలో 10 మంది యువతకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తామని హామీనిచ్చారు. వీరికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం అందజేస్తామని పేర్కొన్నారు. ఆ ఇళ్లలో వారికి రేషన్, విద్యుత్, తదితర సమస్యలను సచివాలయం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు పనిచేస్తారని తెలిపారు. వీరి నియామకం పార్టీలకతీతంగా జరుగుతోందని .. దీంతో లంచాల బెడద కూడా తప్పుతోందన్నారు జగన్.
జాబు రావాలంటే బాబు పోవాలి
గత ఎన్నికల్లో జాబు రావాలంటే బాబు రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు .. అధికారం చేపట్టాక ఉద్యోగాల సంగతి పక్కనపెట్టారని విమర్శించారు. దీంతో యువత జాబు రావాలంటే బాబు పోవాలని అంటున్నారని పేర్కొన్నారు. 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా భర్తీ చేయలేదని విమర్శించారాయన. రాష్ట్రంలో చంద్రబాబు బాగుంటే అంతా బాగున్నట్టేనా అని సెటైర్లు వేశారు.
స్థానికులకే ఉద్యోగాలు
నందికొట్కూరు ప్రచారంలో యువతకు వరాలు కురిపించారు జగన్. రాష్ట్రంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలనే చట్టం తీసుకొస్తామని ప్రకటించారు జగన్. అలాగే స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చి .. ఉఫాది కల్పిస్తామని హామీనిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగాలను నిరుద్యోగ యువతకే ఇస్తామని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాల అమలు బాధ్యతను వారికి అప్పగిస్తామని పేర్కొన్నారు. ఏపీలోని 25 సీట్లలో వైసీపీ విజయం సాధిస్తే హోదాకు మద్దతిచ్చే పార్టీకే మద్దతు తెలుపుతామని చెప్పారు. దీంతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేశారు జగన్.
ఎన్నికల ప్రచారంలో జగన్: హోరెత్తిన జనం (ఫొటోలు)
అత్యంత ధనవంత సీఎం బాబు, పేద రైతు
ఐదేళ్లలో చంద్రబాబు మరిన్ని ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు జగన్. దీంతో దేశంలో అత్యంత ధనవంత సీఎంగా మారాడని .. కానీ రాష్ట్రలోని రైతు పేద రైతుగా నిలిచాడని నిట్టూర్చారు. రాష్ట్రలోని రైతుల రుణబాధలు అన్నీ ఇన్నీ కావని గుర్తుచేశారు. అలాగే మహిళా సంఘాలను కూడా చంద్రబాబు నమ్మించి మోసం చేశారని విమర్శించారు.