రాజధాని మార్చాలనుకుంటే మళ్ళీ ఎన్నికలకు వెళ్ళండి..వైసీపీ గెలిస్తే రాజకీయాలు వదిలేస్తా: చంద్రబాబు
అమరావతి రాజధాని కోసం టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం సాగిస్తున్నారు . సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి రాజధాని అమరావతికే టీడీపీ కట్టుబడి ఉన్నదని తమ స్టాండ్ ప్రకటించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా నేడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఇక అనంతపురం పెనుగొండలో పర్యటించిన చంద్రబాబు వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. మోసాలు చేయడంలో సీఎం జగన్ దిట్ట అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు ఎద్దేవాచేశారు.
పెనుగొండలో పర్యటించి విరాళాలు సేకరించిన చంద్రబాబు
పెనుగొండలోనూ పర్యటన చేసిన చంద్రబాబు జోలేపట్టి రాజధాని అమరావతి కోసం విరాళాలు సేకరించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతపురానికి కియా మోటార్స్ తెచ్చి అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు చంద్రబాబు . కర్నూలుకు హైకోర్టు బెంచ్ ఇస్తామని గతంలోనే చెప్పానన్న ఆయన ఇప్పుడు హైకోర్టును కూడా మూడు ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు.
రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలన్న బాబు
పక్క రాష్ట్ర మంత్రి, ప్రతిపక్ష నేతలు కూడా ఏపీ గురించి మాట్లాడుతున్నారని , ఏపీలో మూడు రాజధానులు అయితే అది తెలంగాణాకు లాభం అని చెప్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని లేదంటే రాజధాని రెఫరెండంగా ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని పేర్కొన్న చంద్రబాబు ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ విజయం సాధిస్తే , తాము ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తానని చంద్రబాబు సవాల్ విసిరారు.
జీఎన్ రావు , బోస్టన్ కమిటీ ల నివేదికలను బోగి మంటల్లో కాల్చాలన్న బాబు
కాకినాడలో వైసీపీ ఎమ్మెల్యే బూతులు మాట్లాడుతున్నాడని, వైసీపీ నేతలు తిడితే తాను, పవన్ కళ్యాణ్ పడాలా? అని ప్రశ్నించారు. జీఎన్ రావు కమిటీ , బోస్టన్ కమిటీ ల నివేదికలను బోగి మంటల్లో వెయ్యాలని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి పరిరక్షణ కోసం ప్రజలందరూ పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 2లక్షల కోట్ల విలువైన అమరావతిని అప్పగిస్తే సీఎం జగన్కు చేతకాక నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.
వైజాగ్ రాజధాని అయితే రాయలసీమ వాసులకు తీవ్ర ఇబ్బంది అన్న టీడీపీ అధినేత
రాయలసీమ నుండి విశాఖ పట్నం వెళ్ళాలంటే రెండు రోజులు పడుతుందని , తిరిగి రావటానికి రెండు రోజులు పడుతుందన్న చంద్రబాబు వైజాగ్ రాజధాని అయితే రాయలసీమ వాసులకు తీవ్ర ఇబ్బంది అని చెప్పారు. రాజధాని అమరావతి కోసం అందరూ కలిసి పోరాటం సాగించాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రజలు ఇంతగా శానితియుతం పోరాటాలు చేస్తున్నా వైసీపీ సర్కార్ పోలీసులతో వేధింపులకు గురి చేస్తుందని చెప్పారు. అందరూ రాజధాని అమరావతికి మద్దతుగా నిలవాలని కోరారు చంద్రబాబు.