జగన్ను పార్టీ పెట్టనిచ్చేవాడుకాదు, బాబుకు ముందే తెలుస్తుంది, బలహీనత అదే: కేవీపీ
అమరావతి: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే వారు కాదని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామంద్ర రావు అన్నారు.
షాకింగ్: 'బాబుపై మోడీకి ఆ కక్ష, ఇలా తీర్చుకుంటున్నారు, ఫ్యాక్షనిస్టులకు మరో రూపం'
ఇటీవల రాజ్యసభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ నిరసనలు తెలపడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఆయన ఇటీవల ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్, ప్రత్యేక హోదా, బీజేపీతో టీడీపీ పొత్తు తదితర అంశాల గురించి క్లుప్తంగా మాట్లాడారు.
మోడీకి సోనియా లేఖ రాశారు
ప్రత్యేక హోదా అంశంపై కేవీపీ మాట్లాడుతూ.. హోదా కోసం కాంగ్రెస్ తరఫున రాజ్యసభలో తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. ప్రయివేటు మెంబర్ బిల్లును కూడా పెట్టానని గుర్తు చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సోనియా గాంధీ 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన కొద్ది నెలలకు ప్రధాని మోడీకి లేఖ రాశారని చెప్పారు.
అది చంద్రబాబు బలహీనత
ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ కేంద్రంతో లాలూచీ పడిందని కేవీపీ ఆరోపించారు. ఇది చంద్రబాబు బలహీనత అన్నారు. హోదా ఇవ్వకుండా ప్యాకేజీని ఆయన అప్పుడు అంగీకరించారని, బీజేపీ నేతలను ప్రశంసించారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పార్టీ పెట్టకపోయేవాడు
జగన్, వైసీపీ గురించి కేవీపీ మాట్లాడుతూ.. తనకు తెలిసినంత వరకు వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే తన కొడుకు జగన్ను కాంగ్రెస్ పార్టీ వదిలి వెళ్లనిచ్చే వాడు కాదని చెప్పారు. కాంగ్రెస్ను కాదని జగన్ను కొత్త పార్టీ పెట్టనిచ్చే వాడు కాదన్నారు. రాజీవ్ గాంధీ పట్ల, ఆ కుటుంబం పట్ల వైయస్కు విపరీతమైన అభిమానమని, 1984లో 34 ఏళ్ల వయస్సులో ఆయనను స్టేట్ కాంగ్రెస్ యూనిట్ ప్రెసిడెంట్గా చేశారన్నారు.
చంద్రబాబు పడవపై ఎలుక, మునిగే విషయం తెలుసు
బీజేపీ - టీడీపీ పొత్తు గురించి కేవీపీ మాట్లాడుతూ.. ఇటీవల గుజరాత్, రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాల సరళిని బట్టి చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు రావాలని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పడవ పైన ఉండే ఎలుక లాంటివాడని ఎద్దేవా చేశారు. పడవ మునుగుతుందనే విషయం ఎలుకకు ముందే తెలిసినట్లు, అతనికి తెలుసునని దాని ప్రకారం నడుచుకుంటారని అభిప్రాయపడ్డారు.