కుప్పంలో వైసీపీ గెలిస్తే చంద్రబాబు టూర్ అడ్డుకోవడమెందుకు ? టీడీపీ సూటి ప్రశ్న
ఏపీలో తాజాగా ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అత్యధిక పంచాయతీలు గెల్చుకున్నట్లు అధికారపార్టీ చెప్పుకుంది. ఫలితాలు చూస్తే ఇదే నిజం అనిపించకమానదు. అయితే ఈ ఫలితాలపై స్వయంగా చంద్రబాబే స్పందిస్తూ కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. వాస్తవ పరిస్ధితిని అంచనా వేసేందుకు ఆయన రేపటి నుంచి రెండురోజుల కుప్పం పర్యటనకు వెళ్తున్నారు.
చంద్రబాబు కుప్పం టూర్ నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించింది. దీనిపై టీడీపీ మండిపడుతోంది. కుప్పంలో వైసీపీ గెలిచిందని చెప్పకుంటున్నప్పుడు చంద్రబాబును అడ్డుకోవడం ఎందుకని టీడీపీ ప్రశ్నిస్తోంది. దీనిపై వైసీపీ నుంచి సమాధానం మాత్రం లేదు. చంద్రబాబును మాత్రం కుప్పం పర్యటనలో అడ్డుకునేందుకు వైసీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ హెచ్చరికలతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.
కుప్పంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామన్న వైసీపీ పిలుపుపై స్పందించిన టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇందులో నేరుగా ఆయన సీఎం జగన్నే టార్గెట్ చేశారు. వైఎస్ జగన్ హ్యాండిల్ను ట్యాగ్ చేస్తూ ఏం చేసినా ఇట్టే దొరికిపోతాడు. నిన్నటివరకూ కుప్పంలో గెలిచామని కాలర్ ఎగరేసిన వాడు చంద్రబాబు పర్యటన అనగానే అడ్డుకుంటాం అని ప్రకటించిన అడ్డంగా దొరికిపోయాడంటూ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో గెలుపులో నిజాయితీ ఉంటే అడ్డుకోవాల్సిన పనేముంది జగన్మోహనా అని ప్రశ్నించారు. దొంగ పనులు చేయడం, ఏ2 డైరెక్షన్లో దొరికిపోవడం పంచాయతీ ఎన్నికల వేదికగా మరోసారి రుజువైంది అంటూ ట్వీట్లో అయ్యన్న కడిగిపారేశారు.