మద్రాస్ ఐఐటి నుంచి ఆంధ్ర విద్యార్థిని మాయం: హిమాలయాలకు వెళ్తున్నానని లేఖ
చెన్నై: మద్రాసు ఐఐటీలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని హిమాలయాలకు వెళుతున్నట్లు లేఖ రాసి అదృశ్యమైంది. ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రకాశం జిల్లా రావినూతలకు చెందిన ప్రత్యూష (20) ఐఐటీ ప్రాంగణంలోని సబర్మతి హాస్టల్లో ఉంటోంది.
అయితే ఆమె ఆదివారం నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన విద్యార్థినులు వార్డెన్కు ఫిర్యాదు చేయగా వారు పోలీసులను ఆశ్రయించారు. ప్రాథమిక పరిశీలనలో ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తెలుగు, ఇంగ్లిషులో రాసిన లేఖ దొరికింది.
తనకు ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి అధికమైందని, భగవంతుడి అన్వేషణ కోసం హిమాలయాలకు వెళుతున్నానని, తన కోసం వెతకొద్దని లేఖలో రాసింది. కోట్టూరుపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యార్థిని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
తనకు సాహసం చేయడం ఇష్టమని, ఆధ్యాత్మికంపై తాను పరిశోధన చేస్తానని కూడా ఆమె తన లేఖలో రాసింది. జీవితంలోని ఉన్నత స్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని తాను అనుకుంటున్నట్లు కూడా రాసింది.