తెలంగాణ నుంచి ఆంధ్రాకు అక్రమ మద్యం ... కర్నూల్ శివార్లలో పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు
తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం అక్రమ రవాణా నిత్య కృత్యంగా మారుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ అక్రమ రవాణా చేస్తున్న మద్యాన్ని పట్టుకుంటున్నా మద్యం రవాణా మాత్రం ఆగడం లేదు. ఇక సరిహద్దుల్లో వాహన తనిఖీలు చేస్తున్నా సరే అక్రమార్కులు మద్యం రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు.
లిక్కర్ మాఫియా తెలంగాణలో మద్యాన్ని ఏపీకి తరలించి అక్కడి ధరలతో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బస్సుల్లో, కార్లలో ,కొరియర్ లో, టూవీలర్ ల మీద కూడా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారంటే ఎంత పెద్ద ఎత్తున ఈ మాఫియా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి మద్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతున్నా సరే ఇంకా మద్యం రవాణా కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వస్తున్న వాహనాల మీద, పోలీసులు నిఘా పెట్టి వాహన తనిఖీలు చేస్తున్నా ఇంకా అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. తాజాగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు కర్నూలు నగర శివార్లలో పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద నిఘా పెట్టారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న భారీ మొత్తంలో మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు . తెలంగాణా నుంచి ఆంధ్రాకు ఆటోలో తరలిస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎస్ఈబీ అధికారులు ఆటో నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేశారు .