అక్రమాస్తుల కేసు:ఎసిబి విచారణకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే మరోసారి గైర్హాజరు
అక్రమాస్తుల కేసులో మరో వారం గడువిప్పించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో భాగంగా ఏసీబీ కార్యాలయానికి ఆర్కే తరపు లాయర్లు హాజరయ్యారు. ఆర్కే ఆరోగ్యం కుదుటపడటానికి ఇంకా సమయం పడుతుందని...మరో వారం రోజుల గడువు కావాలంటూ వారు పిటిషన్ దాఖలు చేశారు.
న్యాయవాదుల అభ్యర్థన మేరకు వారం పాటు గడువు ఇస్తూ.. ఈ కేసుని వచ్చే నెల 5కి వాయిదా వేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికు ఓడిఎస్పీ అక్రమాస్తుల కేసులో హాజరుకావాలని ఎసిబి సెక్షన్ 160 కింద నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అనారోగ్య కారణాల వల్ల ఈ నెల 22న విచారణకు హాజరకాలేక పోతున్నట్లు ఆర్కే తొలిసారి విచారణ సందర్భంగా ఎసిబికి విన్నవించుకున్నారు.
దీంతో 29వ తేదీన ఆర్కే హాజరుకావాలంటూ తిరిగి ఎసిబి అధికారులు గడువు ఇచ్చారు. అయితే ఆరోగ్యం ఇంకా మెరుగుపడక పోవడం వల్ల 29 న కూడా విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు న్యాయవాదుల ద్వారా ఆర్కే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో వచ్చే నెల 5వ తేదీన తప్పనిసరిగా హాజరు కావాలని హెచ్చరిస్తూ విచారణ వాయిదా వేశారు.
మరోవైపు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏవో ఇంట్లో బుధవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏవో మాధవరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలిసింది. గుంటూరుతో పాటు జిల్లాలో ఆయనకు సంబంధించిన ఏడు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఏవో మాధవరావుకు సంబంధించి రూ.6 కోట్ల ఆస్తులు గుర్తించారని, వీటి మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల పైనే ఉంటుందని ఎసిబి డిఎస్పి దేవానంద్ తెలిపారు. 20 చోట్ల ఇంటి స్థలాలు గుర్తించి నాలుగు ఇళ్లు సీజ్ చేశామని చెప్పారు. ఒక కారు, రూ.7 లక్షల నగదు దొరికాయన్నారు. బంగారం, వెండి భారీగా దొరకిందని, వీటి విలువ తెలియాల్సి ఉందని డిఎస్పి దేవానంద్ అన్నారు.