గుట్టు చప్పుడు కాకుండా రేషన్ దందా.. పల్నాడులో రెండు లారీల పట్టివేత
తెలుగు రాష్ట్రాల్లో రేషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. సామాన్యులకు రేషన్ కార్డ్ ద్వారా అందించే బియ్యం దొడ్డి దారిన ఇతర రాష్ట్రాలకు చేరుతుంది. కొందరు అక్రమార్కులు రేషన్ బియ్యాన్ని, రీసైకిల్ చేసి ఇతర రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. ఇక ఎపీలోని పల్నాడులో రెండు లారీలను పట్టుకుని రేషన్ దందా గుట్టు రట్టు చేశారు సంబంధిత అధికారులు .
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం .. తెలుగురాష్ట్రాల్లో కొనసాగుతున్న దందా
పేదవాడి కడుపు నింపడం కోసం దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి రూపాయికే రేషన్ బియ్యం అందిస్తుంది ప్రభుత్వం. కానీ ఆ రేషన్ బియ్యం ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో పక్క రాష్ట్రాలకు తరలిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు పక్క రాష్ట్రాలకు చౌకాధర బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. వ్యాపారులు లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని సేకరించి వాటిని రీసైక్లింగ్ చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
రూపాయి కిలో బియ్యాన్ని ఇతర ప్రాంతాల్లో రూ.15 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తున్న ముఠా
రూపాయి కిలో బియ్యాన్ని ఇతర ప్రాంతాల్లో రూ.15 నుంచి రూ.20 వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఎన్పోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేస్తున్నా అక్రమ రేషన్ బియ్యం అక్రమ దందా ఆగటం లేదు . నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న రేషన్ దందా, కొంత కాలంగా ఏపీకి పాకింది. ఇప్పుడు ఏపీ లో సైతం కొందరు ముఠాలుగా ఏర్పడి అక్రమ రేషన్ దందాకు తెరతీశారు. ఎవరికీ పట్టుబడకుండా కొత్త మార్గాల్లో బియ్యం తరలిస్తున్నారు.
దాచేపల్లిలో రెండు లారీల లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న అధికారులు
రేషన్ బియ్యం అడ్డదారిన ఇతర రాష్ట్రాలకు పోకుండా ప్రభుత్వం ఎంత చర్యలు చేపట్టినప్పటికీ అక్రమార్కులు రోజుకో కొత్త మార్గాన్ని ఎంచుకుని రేషన్ దందా చేస్తూనే ఉన్నారు. తాజాగా పల్నాడులో రేషన్ మాఫియా గుట్టు రట్టు చేశారు సంబంధిత అధికారులు .దాచేపల్లిలో రెండు లారీల లో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా పల్నాడు కేంద్రంగా రేషన్ దందా సాగుతున్నా దీనిని కంట్రోల్ చేయడంలో అధికార యంత్రాంగం తీవ్రంగా విఫలమవుతోంది.
గతంలో పలు విమర్శలు .. మావోయిస్టుల హెచ్చరికలు
గతంలో పాలకుల కనుసన్నల్లో రేషన్ దందా చేసినట్లుగా పలు ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి. అంతేకాదు రేషన్ మాఫియాకు వార్నింగ్ ఇస్తూ సిపిఐ మావోయిస్టు పార్టీ పల్నాడు డివిజన్ పేరుతో గతంలో ఒక లేఖను సైతం విడుదల చేసింది. అయినప్పటికీ నేటికీ రేషన్ మాఫియా చాపకింద నీరులా విస్తరిస్తున్నదని, గుట్టుచప్పుడు కాకుండా తమ కార్యకలాపాలు చేస్తుందని తాజాగా రెండు లారీలు పట్టుబడటంతో తేటతెల్లమవుతుంది. ఇక ఈ మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానిదేనని ప్రజలు భావిస్తున్నారు.