అల్లుడితో అక్రమ సంబంధం...కన్న కొడుకు హత్య: ఓ తల్లి ఘాతుకం
నెల్లూరు:మానవతా విలువలు మాయమైపోతున్నాయనడానికి ఈ ఉదంతం ఒక గట్టి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అల్లుడు(కూతురు భర్త)తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తమ రాసలీలలకు అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే కిరాయి హంతకులచేత హత్య చేయించింది.
కొడుకు మృత దేహం కాల్వలో పడేయించగా...పోలీసులు గుర్తుతెలియని మృత దేహంగా స్వాధీనం చేసుకొని అనాథ శవంగా ఖననం చేస్తున్నా ఏమీ తెలియనట్లు మిన్నకుండిపోయింది. అయితే ఈ హత్య చేసిన కిరాయి హంతకులకు సొమ్ము చెల్లించే విషయంలో తేడాలు రావడంతో ముందు ఈ హత్య విషయం ఆ తర్వాత హత్య వెనుక మొత్తం భాగోతం వెలుగు చూశాయి. వివరాల్లోకి వెళితే...
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గమళ్లపాళెంకు చెందిన బొడుగు కార్తీక్ (25) జూలై 17వ తేదీన హత్యకు గురయ్యాడు. జాతీయ రహదారి పక్కన కాల్వలో దొరికిన ఈ మృతదేహాన్ని పోలీసులు గుర్తించలేకపోవడంతో అనాథ శవంగా భావించి ఖననం చేసేశారు. అలా మూడు వారాలుగా మిస్టరీగానే ఉండిపోయిన ఈ హత్య కేసులో పోలీసులకు ఉన్నట్లుండి లభించిన కీలక సమాచారంతో మిస్టరీ వీడటం ఖాయం అయింది.
తాగొచ్చి
పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కార్తీక్ తల్లి తన పెద్ద కుమార్తె భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అది కుమారుడికి తెలిసి అతడు రోజూ మద్యం తాగొచ్చి తల్లిని తీవ్రంగా దుర్భాషలాడటంతో పాటు కొట్టేవాడు. దీంతో ఎలాగైనా కొడుకును వదిలించుకోవాలని నిర్ణయించుకున్న అతడి తల్లి ఇదే విషయమై అల్లుడితో సంప్రదించి కొడుకు కార్తీక్ హత్యకు పథకం రచించింది. అందుకు కిరాయి హంతకులను మాట్లాడివారికి రూ. 5 లక్షలు సుపారి ముట్టచెప్పినట్టు తెలుస్తోంది.
కాలువలో
దీంతో కిరాయి మనుషులు కార్తీక్ను కిడ్నాప్ చేసి టీపీగూడూరు మండలం కోడూరుకు తీసుకెళ్లి హత్య చేశారు. మృతదేహాన్ని మరుసటి రోజు 18వ తేదీన కనుపర్తిపాడు వద్ద జాతీయరహదారి పక్కనే ఉన్న పంట కాలువలో పడేశారు. కార్తీక్ శవాన్ని తొలుత గుర్తించలేకపోయిన పోలీసులు కేసు విచారణలో మాత్రం పట్టుదలతోనే ఉన్నారు. ఈ క్రమంలో దీనిపై వివిధ కోణాల్లో విచారించిన పోలీసులు ఎట్టకేలకు ఈ హత్య వెనుక మిస్టరీని ఛేదించి ఈ మర్డర్ వెనుక హతుడి తల్లే ప్రధాన సూత్రధారిగా నిర్ధారించుకున్నట్లు తెలిసింది.
పోలీసులు
మరింత సమాచారం రాబట్టి ఇందుకూరుపేట మండలం నాగరాజుతోపు ప్రాంతానికి చెందిన కిరాయి హంతకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వాళ్లని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ హత్యకు అసలు సూత్రధారులైన తల్లినీ, ఆమె అల్లుణ్నీ కూడా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారంతా ప్రస్తుతం నెల్లూరు రూరల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.
హత్య
కాగా కిరాయి హంతకులకు కిరాయి చెల్లింపుల్లో తేడా రావడం వల్లే ఈ హత్య వెనక మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. బొడుగు కార్తీక్ హత్యలో కీలకపాత్ర పోషించిన అతని బావ, నాగరాజుతోపుకు చెందిన వెంకటరమణయ్య అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు యువకులతో కలసి నేషనల్ హైవే పక్కన గులాబీ తోటకు తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. కార్తీక్ ను మద్యం తాగుదామని తీసుకెళ్లి అక్కడే హత్య చేసి...పక్కనే ఉన్న కాలువలో శవాన్నిన్ని పడేసి ఎవరు దారిన వారు వెళ్లిపోయినట్లు తెలిసింది.
హంతకులకు
ఆ తరువాత పోలీసులు ఆ శవాన్ని అనాధ మృతదేహం కింద గుర్తించి ఖననం చేస్తున్నా కార్తీక్ తల్లి, బావ ఇద్దరు ఈ విషయం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారని...అయితే కిరాయి హంతకులకు డబ్బు చెల్లించడంలో వచ్చిన తేడాలతో అసలు విషయం బయట పడినట్లు సమాచారం. ఇప్పటికే కీలక సమాచారం రాబట్టిన పోలీసులు నేడో, రేపో ఈ కేసును ఇందుకూరుపేటకు బదిలీ చేస్తారని తెలిసింది.