భర్త ఉండగానే మరొకరితో?: అందుకే చంపేశారా!.. నెల్లూరులో దారుణం
నెల్లూరు: వివాహేతర సంబంధం ఓ మహిళను బలితీసుకుంది. తనను కాదని మరో వ్యక్తితో కాపురం చేస్తున్నందుకు ఆమె భర్త, సోదరుడు కలిసి హత్యకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. నెల్లూరు జిల్లా ధనలక్ష్మీపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ సీఐ శ్రీనివాసులురెడ్డి మృతదేహాన్ని పరిశీలించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఎవరీ వివాహిత?:
నెల్లూరు జిల్లాకు చెందిన స్రవంతికి చిల్లకూరు మండలం ఉడతావారిపాళేనికి చెందిన ఆమె మేనమామ ఈరగ వెంకట రమణతో 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. గతేడాది జనశక్తి నగర్ కాలనీలోని అద్దె ఇంటికి మారినప్పటి నుంచి వీరి కాపురంలో కలహాలు కొనసాగుతన్నాయి.
వివాహేతర సంబంధం:
జనశక్తి నగర్ కి వచ్చాక ధనలక్ష్మీపురానికి చెందిన చల్లా భాస్కర్ అనే వ్యక్తితో స్రవంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో క్రమంగా భర్తకు దూరమై అతని వద్దే ఉండటం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఇటీవలే భాస్కర్-స్రవంతిలు కలిసి ధనలక్ష్మిపురంలోని ఓ ఇంట్లో భార్యాభర్తలుగా అద్దెకు దిగారు. కుమార్తె స్రవంతి వద్దే ఉండగా, కుమారుడు మాత్రం తండ్రి వెంకటరమణతో ఉంటున్నాడు.
పోలీసులకు ఫిర్యాదు..:
తన భార్య భాస్కర్ తో ఉంటున్న విషయం వెంకటరమణకు తెలిసి, ఆమె సోదరుడు రాజేష్ తో కలిసి ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఆమె కూలీ పనికి వెళ్లడంతో... ఇంట్లో ఉన్న కుమార్తెను తమతో పాటు తీసుకొచ్చారు. ఆమె ఇంటికి తిరిగొచ్చిన స్రవంతి.. కుమార్తె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అందుకే హత్య:
పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో... సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని వెంకటరమణ, రాజేష్ స్రవంతికి కబురు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమె దారుణ హత్యకు గురవడం కలకలం రేపుతోంది. తలపై బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె మృతిచెందింది. ప్రస్తుతం ఆమె భర్త వెంకటరమణ, సోదరుడు రాజేష్ పరారీలో ఉండటంతో వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను కాదని, వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నందుకే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.