రోకలిబండతో చంపేసింది: వేరే మహిళతో సంబంధం, నిత్యం వేధింపులు..
వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది.
కడప: భార్యను నిత్యం వేధిస్తూ వచ్చిన ఓ భర్త చివరికి ఆమె చేతిలోనే హతమయ్యాడు. వివాహేతర సంబంధమే అతని హత్యకు కారణమని పోలీసులు నిర్దారించారు. హత్యపై తొలుత బుకాయించిన భార్య.. ఆపై నిజం ఒప్పుకోవడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరు గ్రామానికి చెందిన వేల్పుల రామాంజనేయులుకు, తాడిపత్రికి చెందిన అంకాళమ్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహం తర్వాత నిట్టూరులోనే కాపురం పెట్టిన వీరు.. అక్కడ నిత్యం గొడవ పడుతుండటంతో మైలవరం మండలం గొల్లపల్లెకు మకాం మార్చారు.
గొల్లెపల్లెలో వీరికి బంధువులు ఉండటంతో 10ఏళ్లుగా అక్కడే నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నారు. పశువులను మేపుతూ జీవనం సాగిస్తున్న రామాంజనేయులును ఇటీవలి వర్షాభావ పరిస్థితులు వేరే ప్రాంతానికి వెళ్లేలా చేశాయి. దీంతో ప్రతీ రోజు వేరే గ్రామాలకు పశువులను తీసుకెళ్లి మేపి వస్తుండేవాడు.
ఇదే క్రమంలో కర్నూలు జిల్లా బోడెమనూరులోని ఓ మహిళతో అతనికి పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయాన్ని భార్య అంకాళమ్మకు చెప్పి ఆమెను కూడా అక్కడికే రమ్మన్నాడు. అందుకు భార్య ఒప్పుకోకపోవడంతో విడాకులు ఇవ్వాల్సిందిగా వేధించడం మొదలుపెట్టాడు. దానికి తోడు తాగుడు అలవాటు కూడా ఉండటంతో నిత్యం ఆమెను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు.
భర్త చిత్రహింసలు భరించలేని ఆమె శుక్రవారం తెల్లవారుజామున రామాంజనేయులు తలపై రోకలిబండతో దాడి చేసింది. దీంతో తీవ్ర గాయాలపాలైన రామాంజనేయులు.. అక్కడికక్కడే మృతిచెందాడు. హత్యానంతరం ఇంటి బయట కూర్చున్న అంకాళమ్మను స్థానికులు ప్రశ్నించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఎవరో దుండగులు రాత్రిపూట తన భర్తను హత్య చేసి వెళ్లారని తొలుత అబద్దం చెప్పిన అంకాళమ్మ.. ఆపై నిజం అంగీకరించింది. డాగ్ స్క్వాడ్ ను తీసుకొచ్చి తనిఖీలు చేయిస్తే నిజం బయటపడుతుందని వారు చెప్పడంతో.. భయపడ్డ అంకాళమ్మ నిజం ఒప్పుకుంది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.