బంగాళాఖాతంలో అల్పపీడనం..తుఫాను ముప్పు: తీరంలో హైఅలర్ట్: లంక గ్రామాల్లో భయం
విశాఖపట్నం: కొద్దిరోజులుగా భారీ వర్షాలతో తడిచి ముద్దయిపోయిన రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి.. అల్పపీడనంగా మారింది. వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండురోజులుగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో మరి కొద్దిరోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నంలోని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆ రాష్ట్రం వైపు దూసుకొస్తున్న పెను తుఫాను డోరియన్
పిడుగుపాటుకు అవకాశం..
వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నెల్లూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
కృష్ణమ్మకు వరద ఉధృతి..
మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ఆ రెండు నదులూ మరోసారి వరద పోటుకు గురయ్యాయి. శ్రీశైలం రిజర్వాయర్ ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. ఆరు లక్షల క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీనితో గురువారం సాయంత్రం జల వనరుల శాఖ అధికారులు 10 గేట్లను 24 అడుగుల మేర ఎత్తి, దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం ఏడు గేట్లను ఎత్తేశారు. ఇన్ ఫ్లో అనూహ్యంగా ఉండటంతో సాయంత్రానికి 10 గేట్లను ఏకంగా 24 అడుగుల మేర పెంచారు. జూరాల నుంచి 5,05,336 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 1,58,136 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 11 వేల క్యూసెక్కుల వరద జలాలు శ్రీశైలానికి చేరుకుంటున్నాయి. ఫలితంగా 5,47,630 క్యూసెక్కుల నీటిని దిగువకు వదలి వేస్తున్నారు.
భయం గుప్పిట్లో లంక గ్రామాలు..
ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానది ప్రవాహం ఉరకలెత్తుతోంది. గురువారం సాయంత్రం నుంచి గంట గంటకూ నీటి ఉద్ధృతి పెరుగుతోంది. రెండు లక్షలకు పైగా క్యూసెక్యుల నీటిన దిగువకు వదిలి వేస్తున్నప్పటికీ.. చాలట్లేదని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమణాన్ని మరించ పెంచాల్సి ఉంటుందని, అలా చేస్తే లంక గ్రామాలు వరద ముప్పును ఎదుర్కొంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ కృష్ణానదికి వరద ప్రవాహం శుక్రవారం ఉదయానికి సుమారు ఏడు లక్షల క్యూసెక్కులు ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. రెవెన్యూ యంత్రాంగం లంక ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వరద నీటిని తాకే లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపడుతున్నారు.