ఉపరితల ద్రోణి ప్రభావం: 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
హైదరాబాద్/అమరావతి: మాడు పగులగొడుతున్న ఎండల నుంచి ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించబోతోంది. వచ్చే 48 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ ఉత్తర ప్రాంతం మీదుగా భూ ఉపరితలానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి అవరించి ఉందని, ఫలితంగా వర్షాలు పడతాయని స్పష్టం చేశారు వాతావరణ అధికారులు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
దీనితోపాటు- దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో 1500 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం అలముకుని ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా- కర్ణాటక ఉత్తర ప్రాంతాల్లోనూ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే 48 గంటల్లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, ఉపరితల ఆవర్తన ప్రభావం కోస్తాంధ్ర, రాయలసీమల్లోనూ కనిపించనుందని తెలిపింది. కోస్తాంధ్రలో జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు, రాయలసీమలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు వెల్లడించారు.
ఇదిలావుండగా- రెండు తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ వేసవి సీజన్లో అత్యధికంగా 46 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఫలితంగా- తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిగా తయారయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా 42 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచే ఎండ చురుక్కు మనిపిస్తోంది. సమయం గడిచే కొద్దీ ప్రచండంగా మారుతోంది. ఎండ వేడి దెబ్బకు జనం బెంబేలెత్తుతున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.