ఆ పత్రికపై రూ. 100 కోట్ల పరువునష్టం దావా: ముంబై, జేకేలో ఆలయాలు సహా టీటీడీ కీలక నిర్ణయాలివే..
చిత్తూరు: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తప్పుడు కథనాలు ప్రచురించిందనే ఆరోపణలపై ఒక పత్రిక(ఆంధ్రజ్యోతి)పై రూ. 100 కోట్ల పరువునష్టం దావా వేయాలని నిర్ణయించింది.
ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు
ఆలయ ప్రధాన అర్చకుడిగా రమణదీక్షితుల నియామకానికి టీటీడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం జరిగిన పాలక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్లడించారు. 2019-20 వార్షిక బడ్జెట్ కింద రూ. 3243కోట్లకు పాలక మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు.
ముంబైలో శ్రీవారి ఆలయం..
ఘాట్ రోడ్డు మరమ్మతుల కోసం రూ. 10 కోట్లు, టీటీడీ పరిపాలనా భవనం మరమ్మతుల కోసం రూ. 14.30కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఘాట్ రోడ్డు భద్రత ప్రమాణాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం తెలిపిందని చెప్పారు. రూ. 14 కోట్లతో ముంబైలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం లభించింది.
జమ్మూకాశ్మీర్, వారణాసిలోనూ..
జమ్మూకాశ్మీర్, వారణాసిలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. టీటీడీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో టీటీడీపై తప్పుడు ప్రచారాన్ని అరికట్టేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటు చేస్తున్నామని, దీనికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమిస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వివరించారు.
రూ. 1285కోట్ల ఆదాయం..
2019-20 శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1285 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 330 కోట్ల ఆదాయం సమకూరిందని ఆయన వివరించారు. జనవరి 6న వైకుంఠ ఏకాదశి, 7న ద్వాదశి సందర్భంగా రెండు రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తాం. ప్రోటోకాల్ ప్రముఖులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తాం. వీలైనంత ఎక్కువ మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తామని తెలిపారు.