కట్జూకు అలవాటే, ఊరుకోం, అర్ధనగ్నం ఫోటోలపై జగన్ చెప్పాలి: దులిపేసిన టిడిపి
చంద్రబాబు సర్కార్ను రద్దు చేసి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మొదలు..
అమరావతి: చంద్రబాబు సర్కార్ను రద్దు చేసి, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలన్న మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జూ వ్యాఖ్యలపై టిడిపి నేతలు భగ్గుమన్నారు. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మొదలు.. మంత్రులు చినరాజప్ప వరకు మండిపడ్డారు.
చంద్రబాబు సర్కార్ను రద్దు చేసి.. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి: కట్జూ
వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత క్షమాపణలు చెప్పడం కట్జూకు అలవాటేనని పరకాల ప్రభాకర్ విమర్శించారు. సుప్రీం కోర్టు, సుప్రీం జడ్జిలు, పాత్రికేయులపై గతంలో పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన కట్జూ వాస్తవాలు తెలుసుకొని వాటిని ఉపసంహరించుకున్నారన్నారు.
కట్జూ, జగన్ సమాధానం చెప్పాలి
మహిళా ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను అర్థనగ్నంగా చిత్రీకరించడం, అసభ్య వ్యాఖ్యానాలు జోడించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా పోస్టులు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛ ఎలా అవుతుందో కట్జూ, వైసిపి నాయకులు సమాధానం చెప్పాలని పరకాల డిమాండ్ చేశారు.
ఊరుకునేది లేదు
కట్జూ లేదా వైసిపి నాయకుల ఇళ్లల్లోని మహిళలపైన ఇదే తరహాలో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెడితే దాన్ని కూడా భావ ప్రకటన స్వేచ్ఛగానే భావించి వారు సమర్థిస్తారా? అని పరకాల నిలదీశారు. ప్రభుత్వ వైఫల్యాలు, తప్పులను ఎత్తి చూపి సామాజిక మాధ్యమాల్లో నిర్మాణాత్మక విమర్శలు చేస్తే తాము స్వాగతిస్తామని, కానీ సభ్యసమాజం తలదించుకునేలా చేస్తే చట్టం తన పని తాను చేస్తుందన్నారు.
కట్జూ ఉపసంహరించుకుంటారని.., కొత్తపల్లి గీతపై..
వాస్తవాలు తెలుసుకోకుండా కట్జూ భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట వ్యాఖ్యలు చేయడం సరికాదని పరకాల అన్నారు. అన్ని వివరాలు పంపిస్తామని, ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటారని భావిస్తున్నామని, ఎంపీ కొత్తపల్లి గీతకు సంబంధించిన చిత్రాలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవికిరణ్పై 2014 జులై 31న విశాఖ జిల్లా గూడెంకొత్త వీధి మండలంలో కేసు నమోదయిందని, వైసిపి నాయకులకు భావ ప్రకటన స్వేచ్ఛ అప్పుడు ఎందుకు గుర్తుకు రాలేదన్నారు.
ఉపేక్షించిదే లేదు
సోషల్ మీడియాలో అసభ్యకరమైన, కించపరిచే పోస్టింగులు పెడితే ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హోంశాఖా మంత్రి చినరాజప్ప హెచ్చరించారు. వైసిపి మద్దదుతారులు, సానుభూతిపరులు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. దీనిని వైసిపి రాద్దాంతం చేస్తోందన్నారు.
వర్ల రామయ్య ఖండన
దళిత మహిళపై అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తిని చట్టబద్దంగా అరెస్టు చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని జస్టిస్ కట్జూ కోరడాన్ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఖండించారు.