ఇటీవల ప్రకటించిన 20 వేల ఉద్యోగాల భర్తీ...కష్టమేనంటున్న విద్యారంగ నిపుణులు
అమరావతి:త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణలో అమలు కావడంపై కష్టమేనని విద్యారంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, ఆర్థికశాఖ అభ్యంతరాలు, సమయం తగినంత లేకపోవడం ఇత్యాది కారణాలను పరిశీలించి చూసినప్పుడు ఈ ఉద్యోగాలు మార్చి లోపు భర్తీ కావడం దాదాపు అసంభవమన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తీకరిస్తున్నారు. తాము ఉన్నతాధికారులతో మాట్లాడితే వారు కూడా ఇది అసాధ్యమేనని అభిప్రాయపడినట్లుగా విద్యారంగం నిపుణులు చెబుతున్నారు.
నిరుద్యోగుల ఆశ...నిరాశ
రాష్ట్రంలో త్వరలో ఉపాధ్యాయుల పోస్టులతో సహా 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఎంతో సంతోషించిన నిరుద్యోగుల ఆశలపై క్రమంగా నీలినీడలు కమ్మకుంటున్నాయి. నిజంగా ఆ ప్రకటన వాస్తవ రూపం దాలుస్తుందా అనే సందేహాలు వారిని ఆవరిస్తుంటే ఆందోళనతో ఉద్యోగాల భర్తీపై విద్యారంగ నిపుణులను, అధికారులను ఆరా తీస్తున్నారు. అయితే వారు చెబుతున్న సమాచారం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రక్రియ...ప్రారంభం కాలేదు
ఈ నెల 2 వ తేదీన జరిగిన కేబినెట్ భేటీలో రాష్ట్రంలో 20వేల ఉద్యోగాల ఖాళీలు, 9,000 టీచర్ల పోస్టులతో పాటు ఇతరత్రా శాఖల్లో ఉన్న ఖాళీలు భర్తీచేయాలని తీర్మానించడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆ దిశలో నామమాత్రపు ప్రక్రియ కూడా ప్రారంభం కాకపోవడాన్ని విద్యారంగ నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం మొదలుకొని రాతపరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్ధులను ఎంపిక చేయడానికి కనీసం సంవత్సరం పడుతుందనేది వారి అంచనా.
కనీసం...ఏడు నెలలు
ఒకవేళ ఈ ఉద్యోగాల భర్తీ యుద్దప్రాతిపదికన చేపట్టారనుకున్నా అలాగైనా కనీసం ఆరునుండి ఏడునెలల సమయం పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియను ఎప్పుడో ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ డిఎస్సీ నోటిఫికేషన్ను విడుదల కాకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. 2015లో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదని గుర్తుచేస్తున్నారు. ఎపిపిఎస్సీకి ఈ ఉద్యోగాల భర్తీ బాధ్యత అప్పగించినప్పటికీ కొన్ని పోలీసు ఉద్యోగాలు తప్ప ఇతర ఖాళీల భర్తీ పూర్తి స్థాయిలో జరగలేదనే విషయాన్ని విశ్లేషిస్తున్నారు.
ఆర్థిక శాఖ...అభ్యంతరాలు
దాదాపు మూడేళ్ల క్రితం చేసిన ప్రకటన పరిస్థితే ఇలా ఉంటే...ఒకవైపు ఆర్థికశాఖ ససేమిరా అంటున్న తాజా పోస్టుల భర్తీ ఎప్పటికి సాధ్యమవుతుందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక 20 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటివరకు ఏయే శాఖల వారీగా ఎన్ని ఖాళీలున్నాయన్న విషయాన్ని మాత్రమే అధికారికంగా గుర్తించడం జరిగిందని...అయితే ఆ జాబితా సిద్ధం కాగానే వాటిపై ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపిందని విద్యారంగ నిపుణలు తెలియజేస్తున్నారు.
సిఎంవో...హెచ్చరికలు
అయితే దీనిపై ముఖ్యమంత్రి కార్యాలయం గట్టిగా జోక్యం చేసుకొని హెచ్చరించడంతో ఆర్థిక శాఖ సైలెంటయిపోయిందని చెబుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ అనేది పూర్తి స్థాయి రాజకీయ నిర్ణయంగా కనిపిస్తుందని...మరి అది ఎంతవరకు సాకారమవుతుందనేది వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఆయా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలై, ఆ ప్రకారం ప్రక్రియ పూర్తయ్యి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడం గడువులోపల పూర్తవడం సాధ్యం కాదనే అనుకుంటున్నామన్నారు. అధికారులు కూడా ఆఫ్ ద రికార్డ్ అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.