బ్రాహ్మణి స్టీల్స్ లో కదలిక: ప్లాంట్ ను పరిశీలించిన విదేశీ సంస్థ: టేకోవర్ పై ఆసక్తి!
కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ లల్లో ఒకటి బ్రాహ్మణి స్టీల్స్. కర్ణాటకకు చెందిన భారతీయ జనతాపార్టీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ అది. కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలోని చిటిమిటి చింతల అనే తండా సమీపంలో 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు.
ఒక్క కడప జిల్లా మాత్రమే కాదు.. రాయలసీమలోని నాలుగు జిల్లాల దశ-దిశనూ సమూలంగా మార్చివేసే విప్లవాత్మక ప్రాజెక్టు అది. ఎలాంటి పరిస్థితుల్లో ఆ ప్లాంట్ రద్దయిందనేది ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేని విషయం. మొక్క కూడా మొలవని, తొండలు కూడా గుడ్లు పెట్టని ప్రాంతంలో శంకుస్థాపన చేసుకున్న బ్రాహ్మణి స్టీల్స్ వల్ల అపారమైన ప్రకృతి సంపద, అటవీ ఉత్పత్తులు, అరుదైన మొక్కలు.. ఇవన్నీ నాశనమైపోతాయంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూయడం, ఆ తరువాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం.. ఈ స్టీల్ ప్లాంట్ కు కేటాయించిన భూములను రద్దు చేయడం జరిగిపోయాయి.
తాజాగా ఈ ప్లాంట్ పనుల్లో కదలిక మొదలైందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. తాను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తానంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బ్రాహ్మణి స్టీల్స్ ప్లాంట్ నిర్మాణ మళ్లీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఎంఆర్ అనే ఓ విదేశీ సంస్థ బ్రాహ్మణి స్టీల్స్ ను టేకోవర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంస్థ ప్రతినిధులు బుధవారం బ్రాహ్మణి స్టీల్స్ నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పట్లో అక్కడ నిర్మితమైన గెస్ట్ హౌస్ సహా మధ్యలో ఆగిపోయిన కొన్ని కట్టడాలను పరిశీలించారు. 140 గదులతో ఈ గెస్ట్ హౌస్ నిర్మితమైంది. బ్లాస్ట్ ఫర్నేస్, వెల్డింగ్ షెడ్, పవర్ ప్లాంట్, సబ్ స్టేషన్ లను పరిశీలించారు. నీటిని నిల్వ చేయడానికి నిర్మించిన రిజర్వాయర్ సెంట్రల్ ప్లాంట్ ను సైతం ఐఎంఆర్ ప్రతినిధులు తిలకించారు. ప్రభుత్వం కేటాయించిన భూమి వివరాలు, రోడ్డు, రైలు కనెక్టివిటీ, నీటి కేటాయింపులు.. వంటి వివరాలను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారికి వివరించారు.